AP Volunteers: 62 వేలకు చేరిన వాలంటీర్ల రాజీనామాలు-ఈసీకి హైకోర్టు కీలక ఆదేశం.. !
ఏపీలో ఎన్నికల నేపథ్యంలో భారీగా వాలంటీర్ల రాజీనామాల వ్యవహారం కలకలం రేపుతోంది. సంక్షేమ పథకాల పంపిణీ నుంచి తమను తప్పిస్తూ గతంలో ఈసీ ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలో ఏకంగా 62 వేల మంది వాలంటీర్లు రాజీనామాలు చేసినట్లు ఈసీ లెక్క తేల్చింది. ఈ మేరకు ఇవాళ హైకోర్టులో అఫిడవిట్ సమర్పించింది. దీంతో వీరి రాజీనామాల ఆమోదం విషయంలో హైకోర్టు ఈసీ వివరణ కోరింది.
రాష్ట్రంలో ఎన్నికల వేళ వాలంటీర్ల రాజీనామాల్ని అడ్డుకోవాలంటూ హైకోర్టులో బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. అసలు ఎంత మంది వాలంటీర్లు ఇప్పటివరకూ రాజీనామాలు చేశారు. అలాగే ఎంతమందిపై చర్యలు తీసుకున్నారనే వివరాలు కోరింది. దీంతో స్పందించిన ఈసీ... ఇప్పటివరకూ 62 వేల మంది రాజీనామాలు చేసారని, 900 మందిపై చర్యలు తీసుకున్నామని హైకోర్టుకు తెలిపింది.

అయితే ఈ రాజీనామాల్ని ఆమోదించవద్దని పిటిషనర్ బోడే రామచంద్రయాదవ్ హైకోర్టును కోరారు. ఈ మేరకు ఈసీకి ఉన్న విస్తృత అధికారాల్ని వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు ధర్మాసనం.. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించేందుకు వాలంటీర్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని కోరింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. రెండు వారాల్లో ఈ వివరణ రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపింది.












Click it and Unblock the Notifications