అమరావతి భూముల్లో పేదల ఇళ్ల స్ధలాలకు బ్రేక్.. హైకోర్టు వ్యాఖ్యల ఉద్దేశం అదేనా !
అమరావతి భూముల్లో కొంత భాగాన్ని ఉగాది నాటికి ఏపీలో పేదలకు పంచాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. రాజధానిలో రైతులిచ్చిన భూముల పంపకాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అవసరమైతే ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం సైతం కోరతామని హెచ్చరించింది. అమరావతిలో ప్రభుత్వానికి భూములివ్వని ఎస్సీ,ఎస్టీ రైతులపై కేసులు పెట్టడాన్ని కూడా హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. దీంతో అమరావతి భూముల్లో పేదలకు భూ పంపిణీ దాదాపు నిలిచిపోయినట్లేనని చెబుతున్నారు.
Recommended Video
అమరావతి భూములు పేదలకిస్తారా
రాజధాని నిర్మాణం కోసం 2016లో అమరావతితో పాటు చుట్టుపక్కల 26 గ్రామాల రైతులు అప్పటి ప్రభుత్వానికి దాదాపు 34 వేల ఎకరాల భూములను రాసిచ్చారు. వీటిని ఇప్పుడు ఉగాదికి పేదలకు ఇళ్ల స్ధలాల పథకంలో భాగంగా పంచిపెట్టాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయంపై కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయింంచారు. దీంతో విచారణ జరిపిన హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజధాని భూములను పేదలకు పంచాలన్న నిర్ణయం సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అదే సమయంలో అమరావతిలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసింది.
కేంద్రం జోక్యం కోరతామన్న హైకోర్టు
అమరావతి రాజధాని అంశం రాష్ట్ర పరిధిలో ఉన్న అంశం అన్న కారణంతో ఇక్కడ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం కుదరదని హైకోర్టు జగన్ సర్కారుకు స్పష్టం చేసింది. దీంతో పాటు రాజధాని భూముల్లో ఎస్సీ, ఎస్టీ రైతుల నుంచి స్ధలాలు సేకరించే సందర్భంగా ఎదురుతిరిగితే కేసులు నమోదు చేయడాన్ని కూడా తప్పుబట్టింది. ఇలాగైతే అమరావతి వ్యవహారంపై కేంద్రం జోక్యం కోరుతూ లేఖ రాయాల్సి ఉంటుందని ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. దీంతో ఈ వ్యవహారం పూర్తిగా యూటర్న్ తీసుకున్నట్లయింది.
అమరావతిలో భూపంపిణీకి బ్రేక్..
రాజధానిలో రైతులు ఇచ్చిన భూములను పేదలకు పంపిణీ చేయాలన్న ఏపీ సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టు తాజా హెచ్చరికలు చూస్తుంటే ఇక ఇక్కడ భూముల పంపిణీకి బ్రేక్ పడినట్లే కనిపిస్తోంది. ఉగాదికి రాష్ట్రంలో ఇళ్ల స్ధలాలు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి కూడా హైకోర్టు దాదాపుగా బ్రేక్ వేసేసింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఉగాదికి ఇళ్ల స్ధలాల పంపిణీ చేపట్టకపోవడమే మంచిదని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. దీంతో రాజధానిలో భూములతో పాటు రాష్ట్రంలో ఏ భూమినీ ఉగాదికి ప్రభుత్వం పంచే అవకాశాలు కనిపించడం లేదు.
ప్రభుత్వం ముందు ప్రత్యామ్నాయాలేంటి
అమరావతి భూములను పేదలకు పంచే విషయంలో హైకోర్టు విచారణ సందర్భంగా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ వ్యవహారంలో తుది తీర్పు ఎలా వస్తుందన్న అంశంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది. అయితే ఈ నెలలోనే తుది తీర్పు వచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ వ్యవహారంలో ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలిస్తోంది. అమరావతి భూముల్లో పేదలకు ఇళ్ల స్ధలాలు ఇవ్వొద్దని హైకోర్టు తీర్పు ఇస్తే సుప్రీంకోర్టులో న్యాయపోరాటం కొనసాగింపు సహా పలు విధానపరమైన నిర్ణయాలను తీసుకునే దిశగా ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది.