దేవాదాయశాఖకు సలహాదారేంటి ? జగన్ సర్కార్ కు హైకోర్టు కీలక ప్రశ్నలు- శ్రీకాంత్ నియామకంపై స్టే
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారీ సంఖ్యలో సలహాదారుల్ని నియమిస్తూ వస్తున్నారు. తొలుత సీఎం జగన్ కు సలహాదారుల్ని నియమించిన ప్రభుత్వం.. అనంతరం ప్రభుత్వ వ్యవహారాలకు సలహాదారుల్ని నియమించింది. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ శాఖలకు సలహాదారుల్ని నియమిస్తోంది. ఇదే క్రమంలో దేవాదాయశాఖకు నియమించిన సలహాదారు శ్రీకాంత్ వ్యవహారంపై స్పందించిన హైకోర్టు స్టే ఇచ్చింది.
వైసీపీ సర్కార్ దేవాదాయశాఖకు సలహాదారుగా జె.శ్రీకాంత్ ను నియమించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇది నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై సీజే ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ సోమయాజులు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సలహాదారుల నియామకాన్ని తప్పుబట్టిన హైకోర్టు.. శ్రీకాంత్ నియామక జీవోను నిలిపివేస్తూ స్టే ఉత్తర్వులు ఇచ్చింది. అంతే కాదు ప్రభుత్వంలో సలహాదార్ల నియామకం తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

రాష్ట్రంలో ప్రభుత్వం నియమిస్తున్న సలహాదారులపై స్పందించిన హైకోర్టు ధర్మాసనం.. ఇలానే వదిలేస్తే రేపు అడ్వకేట్ జనరల్కు కూడా సలహాదారుని నియమిస్తారమంటూ వ్యాఖ్యానించింది. సలహాదారులను నియమించేందుకు అధికారుల కొరత ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సలహాదారులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారన్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మంత్రులకు సలహాదారులు ఉంటే అర్థం ఉందని,శాఖలకి సలహాదారు ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వం ఇరుకునపడింది.












Click it and Unblock the Notifications