సలహాదారుల వివాదంపై ఏపీ హైకోర్టు ఫైర్ ! రాజకీయాలు బయటే చూసుకోండి..ఎలా హ్యాండిల్ చేయాలో..
ఏపీలో వైసీపీ సర్కార్ సలహాదారుల నియామకం వ్యవహారం మరోసారి హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సలహాదారుల నియామకంపై జరుగుతున్న రచ్చపైనా హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇద్దరు సలహాదారుల నియామకంపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఏపీలో సలహాదారుల నియామకాల వ్యవహారంపై ఇవాళ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. దేవాదాయశాఖ సలహాదారుడు శ్రీకాంత్ నియామకంతో పాటు ఉద్యోగుల సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి నియామకంపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్లు, ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఏవైనా రాజకీయాలుంటే బయటే చూసుకోవాలని హైకోర్టు సూచించింది. రాజకీయాలను కోర్టు వరకూ తీసుకురావద్దని సూచించింది. రాజకీయాలు తీసుకొస్తే ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసని హెచ్చరించింది.
హైకోర్టు హెచ్చరికలపై స్పందించిన అడ్వకేట్ జనరల్ శ్రీరాం సుబ్రహ్మణ్యం.. నిష్ణాతులైన వారినే సలహదారులుగా నియమిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోబోయే ముందు సలహాదారుల అభిప్రాయం తీసుకుంటుందని కోర్టుకు తెలిపారు. కాబట్టి వారి నియామకం విషయంలో మెరిట్స్ పై వాదనలు వినిపిస్తామని హైకోర్టుకు వెల్లడించారు. దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. ఉద్యోగుల టీఏ, డీఏ కోసం మరో సలహాదారుడిని నియమిస్తారా? అని ప్రశ్నించింది. ఈ సలహాదారుల నియామకం ప్రమాదకరమైన వ్యవహారమని హైకోర్టు ధర్మాసనం తెలిపింది.