చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలా వద్దా ? కాసేపట్లో తేల్చనున్న హైకోర్టు..!
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని చెబుతున్న స్కిల్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలా వద్దా అన్న దానిపై హైకోర్టులో ఉత్కంఠ కొనసాగుతోంది. స్కిల్ కేసులో రిమాండ్ లో ఉంటున్న చంద్రబాబుకు ఆరోగ్య సమస్యల కారణంగా ఇప్పటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీని గడువు ఈ నెల 28తో ముగియనుంది. ఈ నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ విషయంలో హైకోర్టు విచారణ జరుపుతోంది.
మరోవైపు మధ్యంతర బెయిల్ తీసుకున్న తర్వాత చంద్రబాబు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో కంటి ఆపరేషన్ తో పాటు గుండె సమస్యలకు కూడా పరీక్షలు చేశారు. ఇందులో చంద్రబాబు గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. దీంతో డాక్టర్లు ఇచ్చిన నివేదికను ఆయన తరఫు లాయర్లు నిన్న హైకోర్టుకు అందజేశారు. దీన్ని పరిశీలించిన హైకోర్టు ఇవాళ తదుపరి విచారణ జరిపేందుకు వీలుగా వాయిదా వేసింది.

దీంతో ఇవాళ స్కిల్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలా వద్దా అన్న దానిపై తదుపరి విచారణ జరపబోతోంది. ఇందులో ఆయన లాయర్లు.. చంద్రబాబు ఆరోగ్య సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని ఆయనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కోరబోతున్నారు. అలాగే స్కిల్ కేసులో చంద్రబాబుకు తప్ప మిగతా అందరికీ బెయిల్ ఇచ్చేసిన విషయాన్ని కూడా కోర్టు ముందుకు తీసుకురాబోతున్నారు. దీంతో హైకోర్టు ఇచ్చే తీర్పు కీలకంగా మారింది.
ఇప్పటికే స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ పై ఉన్న చంద్రబాబుపై ఇతర కేసుల్లో చర్యలు తీసుకోబోమని హైకోర్టుకు సీఐడీ హామీ ఇచ్చింది. దీంతో ఈ నెల 22 నుంచి చంద్రబాబుపై నమోదైన ఇతర కేసుల విచారణ కూడా ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ పై వెంటనే తేల్చాలని చంద్రబాబు లాయర్లు హైకోర్టును కోరుతున్నారు.












Click it and Unblock the Notifications