ఏపీ లిక్కర్ కేసులో తాజా ట్విస్ట్ లు..! హైకోర్టు కీలక నిర్ణయం..!
వైసీపీ హయాంలో జరిగిందని ఆరోపిస్తున్న ఏపీ మద్యం స్కాంలో గత రెండు రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తూ ఇప్పటికే సిట్ అరెస్టు చేసిన ఐదుగురిలో నలుగురికి వివిధ కారణాలతో విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ లభించింది. ఏసీబీ కోర్టు నిర్ణయాలు సహజంగానే సిట్ తో పాటు ప్రభుత్వానికి షాకిచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని సవాల్ గా తీసుకుంటోంది.
మద్యం స్కాంలో నిందితులుగా భావిస్తూ సిట్ అరెస్టు చేసిన మాజీ అధికారులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు భారతీ సీమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ఇప్పటివరకూ జైల్లోనే ఉన్నారు. అయితే తాజాగా వీరు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను విచారించిన విజయవాడ ఏసీబీ కోర్టు.. వీరి విజ్ఞప్తిని మన్నించింది. దీంతో ఈ ముగ్గురూ బెయిల్ పై విడుదలయ్యారు. మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మరో నిందితుడు, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సైతం తాత్కాలిక బెయిల్ మంజూరు చేశారు. దీంతో మిథున్ రెడ్డి మినహా మిగిలిన నిందితులపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.

మద్యం కేసులో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు భారతీ సీమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఇవాళ ఆదివారం కావడం, అత్యవసర పిటిషన్ కాకపోవడంతో హైకోర్టు దీనిపై రేపు రెగ్యులర్ విచారణ జరపాలని నిర్ణయించింది. దీంతో ఈ ముగ్గురి బెయిల్ రద్దు పిటిషన్లపై రేపు హైకోర్టు విచారణ జరిపి కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఇప్పటికే మద్యం స్కాం కేసులో సిట్ దూకుడుగా వ్యవహరించడం లేదన్న చర్చ ఉంది. ఓ దశలో జగన్ ను సైతం అరెస్టు చేస్తారని ప్రచారం జరిగినా ఇప్పటివరకూ ఆయన్ను నిందితుడిగా సైతం చేర్చడంలో సిట్ విఫలమైందన్న చర్చ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అరెస్టు చేసిన నిందితులు సైతం బెయిల్ పై విడుదల కావడంతో సిట్ ఆత్మరక్షణలో పడుతోంది. దీంతో ప్రభుత్వం కేసు కీలక దశలో ఉన్నందున వీరి బెయిల్స్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టు పిటిషన్లు దాఖలు చేసింది.












Click it and Unblock the Notifications