కరోనా డాక్టర్లను ఇళ్లకు రానివ్వం- యజమానులపై హైకోర్టు ఆగ్రహం- చర్యలకు ఆదేశం
ఏపీలో కరోనా వైరస్ తో పోరాడుతున్న ఎందరో రోగులకు ప్రాణం పోస్తున్న వైద్యులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే మాస్కులు, ఇతర వ్యక్తిగత రక్షణ పరికరాలు లేకపోయినా వైద్యం అందిస్తున్న వీరికి ఇంటి యజమానుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి. దీనిపై దాఖలైన కేసును విచారించిన ఏపీ హైకోర్టు... ఇలాంటి చర్యలను సహించబోమని స్పష్టంచేసింది.
ఇళ్ల యజమానులపై హైకోర్టు సీరియస్...
కరోనా వైరస్ పై పోరాడుతున్న వైద్యులకు ప్రధాని, ముఖ్యమంత్రులు, సెలబ్రిటీలతో పాటు అందరూ చేతులెత్తి మొక్కుతుంటే కొందరు మానవత్వం లేని ఇళ్ల యజమానులు మాత్రం వారిని ఇళ్లలోకి రానీయకుండా అడ్డుకుంటున్నారు. వారిని ఇళ్లు ఖాళీ చేయాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీనిపై ఇవాళ దాఖలైన ఓ కేసును విచారించిన ఏపీ హైకోర్టు ఇలాంటి ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వైద్యుల ఫిర్యాదు ఆధారంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని హైకోర్టు ఆదేశించింది.

వ్యక్తిగత రక్షణ పరికరాలు ఇవ్వాల్సిందే..
కరోనా వైరస్ తో పోరాడుతున్న రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లకు నాణ్యమైన మాస్కులతో పాటు వ్యక్తిగత రక్షణ కిట్లు కూడా అందుబాటులో ఉంచాలని గతంలో తాము జారీ చేసిన ఉత్తర్వుల అమలుపైనా హైకోర్టు ఇవాళ అధికారులను ప్రశ్నించింది. తమ ఉత్తర్వులు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మార్కెట్లు, రైతుబజార్లు, కోర్టు ప్రాంగణాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో క్రిమి సంహారక టన్నెల్స్ ఏర్పాటు చేసే అంశంపైనా వారంలో వివరాలు సమర్పించాలంది.












Click it and Unblock the Notifications