కానిస్టేబుల్ కోరిక నెరవేర్చిన హోంమంత్రి అనిత
విధి నిర్వహణ అంటే యూనిఫాం వేసుకుని డ్యూటీ చేయడమే కాదు... బాధ్యత, మానవత్వం కలిసిన సేవే నిజమైన పోలీస్ డ్యూటీ అన్న మాటకు కానిస్టేబుల్ జయశాంతి ఉదాహరణగా నిలిచారు. విధిలో లేకపోయినా, చంటి బిడ్డను చంకనెత్తుకుని ట్రాఫిక్ను సరిచేసిన ఆమె సేవాభావం రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు పొందింది.
రంగంపేటకు చెందిన కానిస్టేబుల్ జయశాంతి.. సంక్రాంతి పండుగ సమయంలో కాకినాడ కెనాల్ రోడ్డులో చేతిలో చంటిబిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేయడంతో పాటు అంబులెన్స్ కు దారి ఇచ్చేందుకు చేసిన కృషి హోంమంత్రి వంగలపూడి అనిత దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన మంత్రి అనిత రెండు రోజుల క్రితం జయశాంతికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఆ సంభాషణలో మంత్రిని కలవాలన్న కోరికను జయశాంతి వ్యక్తం చేయగా, దానికి అనిత సానుకూలంగా స్పందించారు.

ఈ నేపథ్యంలో గురువారం ఉదయం విజయవాడలో హోంమంత్రి వంగలపూడి అనిత, కానిస్టేబుల్ జయశాంతిని ఆహ్వానించి ప్రత్యేకంగా కలిశారు. జయశాంతితో కలిసి మంత్రి అనిత అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
జయశాంతి పిల్లలతో మంత్రి అనిత సరదాగా ముచ్చటించగా, ఆ వాతావరణం మరింత సన్నిహితంగా మారింది. తల్లి పాత్రతో పాటు విధి బాధ్యతను సమతుల్యం చేస్తూ ముందుకెళ్తున్న జయశాంతిని మంత్రి ప్రశంసించారు. సేవాభావం ఉన్న మహిళా పోలీసులే సమాజానికి నిజమైన ఆదర్శమని అనిత పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కానిస్టేబుల్ జయశాంతి కుటుంబ సభ్యులను మంత్రి అనిత సత్కరించారు. మంత్రిని కలవడం, ఆమె నుంచి గౌరవం పొందడం తన జీవితంలో మరిచిపోలేని క్షణమని జయశాంతి భావోద్వేగంతో వెల్లడించారు. తాను చేసిన పని గుర్తించబడటం మరింత బాధ్యతగా పనిచేయాలనే ప్రేరణనిచ్చిందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications