LPG: ఏపీలో వ్యాపారులకు ఊరట- కమర్షియల్ గ్యాస్ పై సర్కార్ ఉత్తర్వులు..!
ఇరాన్ వార్ ప్రభావంతో ఎల్పీజీ (LPG) సరఫరాలు తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్న వ్యాపారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం వాణిజ్య అవసరాలకు 70 శాతం మేర గ్యాస్ అదనపు కోటాను కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చింది. వ్యాపారులు తమ అసోసియేషన్ పరిధిలో గ్యాస్ ఎంత మేర అవసరమో జిల్లా జాయింట్ కలెక్టర్లకు చెబితే, ప్రాధాన్యత ప్రకారం గ్యాస్ బండలను కేటాయించబోతున్నారు.
రాష్ట్రంలో గ్యాస్, పెట్రోలు, డీజిల్ సరఫరా తీరు, వాస్తవ పరిస్థితి, అందుబాటులో ఉన్న నిల్వలపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, గ్యాస్ ఏజెన్సీలు, స్టేట్ కోఆర్డినేటర్లతో సమీక్షించారు. రాష్ట్రంలో ఎక్కడా ఎల్పీజీ కొరత లేదని, గృహ అవసరాలకు సంబంధించి కొన్ని అనవసర భయాల వల్ల ఎక్కువ బుకింగ్ లు ఇటీవల జరిగాయన్నారు. దీంతో సరఫరాలో కాస్త లోపం వచ్చిందన్నారు. దాన్ని మళ్లీ గాడిన పెట్టే చర్యలు వేగంగా జరుగుతున్నాయన్నారు.

రాష్ట్రంలో సగటున రోజువారీ 1.80 లక్షల గ్యాస్ బుకింగ్ లు జరిగేవని, సోషల్ మీడియాలో వదంతులతో ఒకే రోజు 5 లక్షల బుకింగ్ లు జరిగి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. దీంతో బుకింగ్ చేసుకున్న వారికి కెపాసిటీ మించి డెలివరీలు చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. క్రమంగా బ్యాక్ ల్యాగ్ బుకింగ్ లు పూర్తి అయి, పరిస్థితి మెరుగవుతోందన్నారు. కేంద్రం కూడా అర్బన్ ప్రాంతాల్లో 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గడువులో మాత్రమే గ్యాస్ బుకింగ్ చేసుకునే సౌలభ్యం తీసుకొచ్చింది. దీంతో గ్యాస్ బుకింగ్ లు మెల్లగా సాధారణ స్థాయికి వస్తున్నాయని తెలిపారు. ఇప్పుడు వ్యాపారులు తమ అసోసియేషన్ల ద్వారా జిల్లా జాయింట్ కలెక్టర్లను సంప్రదించి, వారి అవసరాలను తెలియజేస్తే దాని ప్రకారం వాణిజ్య అవసరాలకు గ్యాస్ ను అధికారులు కేటాయిస్తారని మంత్రి తెలిపారు.












Click it and Unblock the Notifications