పరిశ్రమలకు సడలింపులు.. మరి కార్మికుల సంగతేంటి ? ఏపీలో ప్రయత్నం వృథా ?
దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న కరోనా మహమ్మారి కారణంగా ఎప్పుడో భవిష్యత్తులో తలెత్తుతాయని భావించిన ఇబ్బందులు సైతం ముందుకు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్దిక వ్యవస్ధకు కీలకమైన పారిశ్రామిక రంగాన్ని సాధ్యమైనంత త్వరగా గాడిన పెట్టేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు లాక్ డౌన్ ప్రతిబంధకంగా మారుతోంది. ప్రభుత్వాలు కరోనా వైరస్ పై ప్రజలకు పెట్టిన భయాలు ఇందుకు అదనం.
లాక్ డౌన్ సడలింపుతో తెరిచిన పరిశ్రమలు.
ఏపీలో ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రభుత్వం... కరోనా వైరస్ ప్రభావం కారణంగా విధించిన లాక్ డౌన్ లో ఏప్రిల్ 20 తర్వాత కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ముఖ్యంగా భారీ పరిశ్రమలతో పాటు గ్రామీణ పరిశ్రమలకు సైతం యథావిధిగా కార్యకలాపాలు కొనసాగించేందుకు సడలింపులు ప్రకటించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు భారీ పరిశ్రమలు, వాటి అనుబంధ యూనిట్లు పని ప్రారంభించాయి. అయితే పరిశ్రమలు తెరిచామన్న మాటే కానీ కార్మికులు, సిబ్బంది మాత్రం రావడం లేదు.
సిబ్బంది రాక పరిశ్రమల వెతలు...
లాక్ డౌన్ మినహాయింపుల్లో భాగంగా పరిశ్రమలు నడుపుకునేందుకు ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. అయితే కార్మికులు మాత్రం గతంలోలా విధులకు హాజరు కావడం లేదు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలే. లాక్ డౌన్ ఆంక్షలతో పోలీసులు, అధికారులు వీరిని గడప దాటి బయటకు రానివ్వడం లేదు. దీంతో పరిశ్రమలకు ఇచ్చిన సడలింపులు సైతం వృథా అవుతున్న పరిస్ధితి కనిపిస్తోంది.
భారీ పరిశ్రమలకే తప్పలేదు....
ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో ఉత్సాహంగా పరిశ్రమలు తెరిచిన యాజమాన్యాలు ఇప్పుడు వాటిలో సిబ్బంది కానీ, కార్మికులు కానీ రాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సెజ్ కు వెళ్లిన పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి ఈ షాకింగ్ నిజాన్ని అక్కడి యాజమాన్యం వెల్లడించింది. పరిశ్రమలకు సడలింపులు ఇచ్చినా కార్మికులను అనుమతించకపోవడంతో వారు పరిశ్రమలకు చేరుకోలేకపోతున్నారని, ఇలా అయితే మినహాయింపులు ఇచ్చి ఉపయోగం ఏంటని మంత్రిని ప్రశ్నించింది. దీంతో ఆయన ప్రభుత్వంతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చి వెనుదిరిగారు.
Recommended Video
ఇప్పుడే ఇలా ఉంటే... భవిష్యత్తేంటి ?
పారిశ్రామిక రంగం ముందుకు కదలకపోతే దేశం ఆర్ధికంగా వెనుకబడిపోవడం ఖాయం. అందుకే ప్రధాని నుంచి ముఖ్యమంత్రుల వరకూ పరిశ్రమలకు ఎన్నో మినహాయంపులు, సడలింపులు ఇచ్చి మరీ వాటిని తెరిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ మినహాయింపులను కార్మికులు, సిబ్బందికి కూడా ఇస్తేనే వాటి ఫలితం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. మరోవైపు ఇప్పుడే పరిస్ధితులు ఇలా ఉంటే కరోనా వైరస్ ప్రభావం తగ్గాక పరిస్ధితులు ఎలా ఉంటాయో తెలియక పరిశ్రమల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి.