పెట్టుబడులకు అనుకూలం, 21 రోజుల్లోనే..: బాబు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూలనమైన రాష్ట్రమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివరించారు. మంగళవారం విశాఖలో పారిశ్రామిక వేత్తలతో ఆయన ముఖా ముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ కూడా పాల్గొన్నారు. పరిశ్రమలకు 21 కోజులలో అనుమతులు మంజూరు చేస్తామని ఆయన వెల్లడించారు.
పారిశ్రామిక వేత్తలకు సులువుగా అనుమతులు లభించేందుకు ఇ-బిజ్ పోర్టల్ను ఫిబ్రవరిలో ప్రారంభిస్తామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పరిశ్రమలకు కరెంట్ సమస్యలు లేకుండా చూప్తామని ఆయన హామీ ఇచ్చారు. సింగపూర్ తరహాలో రాష్ర్టాన్ని తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. సింగపూర్ పారిశ్రామిక వేత్తలను ఆదర్శంగా తీసుకోవాలని ఏపీలోని పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వేత్తలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తెలిపారు. ఫిబ్రవరిలో ఇ-బిజ్ పోర్టల్ను ప్రారంభిస్తున్నామని, దాంతో పారిశ్రామిక విధానానికి ఒక సమగ్ర స్వరూపం వస్తుందని అభిప్రాయపడ్డారు. సింగిల్ విండో విధానంపై నమ్మకం లేని వారికోసం సింగిల్ డెస్క్ విధానాన్ని ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు. అధికారులు బాద్యతగా వ్యవహరించకపోతే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
చంద్రబాబు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఆయనతో పాటు సింగపూర్ ప్రతినిధులు కూడా అందులో పాల్గొన్నారు. తెలుగు సంస్కృతీసంప్రదాయాలను తెలిపే విధంగా సంబరాలను ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి తిరుపతి బయల్దేరిన సీఎం చంద్రబాబు నాయుడు, సింగపూర్ ప్రతినిధుల బృందం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు.