ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె సైరన్- ఎల్లుండి నుంచే- సర్కారుకు నోటీసు
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతున్న వేళ ప్రభుత్వ తీరును నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టనున్నారు. అదీ ఎల్లుండి నుంచి సమ్మెలోకి వెళ్లాలని వైద్యవిద్యార్ధులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఇవాళ నోటీసు ఇచ్చారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఏపీలో కరోనా నేపథ్యంలో ఫ్రంట్లైన్ వారియర్లుగా ఉన్న వైద్య విద్యార్ధులు సమ్మెబాట పట్టబోతున్నారు. ముఖ్యంగా కోవిడ్ చికిత్స చేస్తున్నందుకు తమకు ప్రోత్సహకాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఆస్పత్రుల్లో భద్రతా ప్రమాణాలు పెంచాలని, స్టయిఫండ్లో టీడీఎస్ కోత విధించవద్దని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు. తమ న్యాయబద్దమైన డిమాండ్లను రేపటిలోగా పరిష్కరించాలని, లేకపోతే ఎల్లుండి నుంచి దశల వారీగా సమ్మెకు దిగుతామని జూడాలు హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వం తమ డిమాండ్లపై రేపటిలోగా స్పందించకపోతే ఈ నెల 9 నుంచి కోవిడ్కు సంబంధం లేని విధులు, 10న కోవిడ్ విధులు, 12న అత్యవసర కోవిడ్ విధులు బహిష్కరిస్తామని జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అక్కడి జూనియర్ డాక్టర్లకు ఈ సదుపాయాలు అన్నీ కల్పించడంతో ఏపీలోనూ వైద్యవిద్యార్ధులు తమకూ వీటిని అందించాలని కోరుతున్నారు. కానీ ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించే పరిస్ధితి లేకపోవడంతో సమ్మె నోటీసు ఇచ్చారు. తెలంగాణలోనూ సమ్మె నోటీసు తర్వాతే కేసీఆర్ సర్కారు జూనియర్ డాక్టర్ల డిమాండ్లను నెరవేర్చడం విశేషం.