ఏపి నేతల్లో భయం.. భయం.. గెలిస్తే జాక్ పాట్..! తేడా వస్తే ఫుట్ పాత్ ..!!
అమరావతి/హైదరాబాద్ : ఓడలు. బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయంటు ఇదే మరి. 2019 సాధారణ ఎన్నికల్లో ఓడిపోతే రోడ్డుపాలు కావటమే అనే ఆందోళన అధికశాతం ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి వినిపిస్తున్న మాట. ఈ జాబితాలో ఎక్కువ మంది వైసీపీకు చెందినవారే ఉన్నారు. దాదాపు తొమ్మిదేళ్లపాటు పార్టీకు అండగా.. నియోకవర్గంలో సొంతడబ్బులు ఖర్చుచేసి మరీ రాజకీయాలు చేశారు. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో పోలీసు కేసులతో భారీగా నష్టపోయిన నేతలూ కనిపిస్తారు.
ఫలితాల సమయం సమీపిస్తోంది..! ఏపి నేతల గుండె దడ పెరుగుతోంది..!!
ఇప్పుడు వీరందరికీ తాము గెలవటమే కాదు.. వైసీపీ అధికారంలోకి రావటం చాలా ముఖ్యం అంటున్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు తదితర జిల్లాల్లో ఇలా అప్పులు చేసి కోట్లాదిరూపాయలు కుమ్మరించి ఎన్నికల బరిలో నిలిచిన నేతలు అక్షరాలా 35-45 మంది వరకూ ఉంటారని అంచనా.. వీరి పేర్ల సంగతి పక్కనబెడితే అందరినీ వేధిస్తున్న సమస్య మాత్రం ఒక్కటే ఓట్లు.. కోట్లు.
ఖర్చు కొద్ది భయం..! ఎంత ఖర్చుకు అంత ఓట్లు..!!
కృష్ణా జిల్లాలో ఇద్దరు వైసీపీ అభ్యర్థులు భారీఎత్తున.. ఊహకు అందని విధంగా 42 కోట్ల రూపాయల వరకూ ఖర్చుచేశారట. స్థిరాస్తులను తాకట్టుపెట్టి మరీ ఓ సీనియర్ నేత ఓటుకు 2000-3000 రూపాయల వరకూ వెచ్చించాడట. దీనికి టీడీపీ నుంచి కూడా కొందరు ఇంటిదొంగలు సహకరించేందుకు ముందుకు రావటంతో ఇక తన గెలుపు సునాయాసం అనే ధీమాలో ఉన్నారు. ఒకవేళ ఓడితే.. రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేసేందుకు సిద్ధపడ్డారట సదరు నేత. గుంటూరు జిల్లాలో వైసీపీ, జనసేనకు చెందిన నేతలదీ ఇదే పరిస్థితి. ఇదే తమకు కీలకమైన ఎన్నికలు అంటున్నారట.
గెలిస్తే మెరుపులు..! ఓడితే చీకట్లే..!!
ఒకవేళ ఓడితే.. ఉన్న ఆస్తులు అమ్ముకుని మిగిలిన డబ్బుతో చిరువ్యాపారం చేసుకోవాలనేంతగా మారారట. విజయవాడలో ఓ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలున్నా.. సొంత పార్టీ నేతలు వెన్నుపోటు పొడవటం, గతంలో చేసిన మోసాల తాలూకూ ప్రతిఫలం వెంటాడుతుందట. అయితే.. ఆ రెండింటినీ అధిగమించేందుకు కోట్లు కుమ్మరించినా ఓటర్లు మాత్రం.. ఛీ కొట్టి ఓటు ప్రత్యర్థి పార్టీకు వేశామంటూ బాహాటంగానే చెబుతున్నారు. కొందరు నేతలు.. పార్టీ అధినేతల వద్దకెళ్లి తమ ఓటమికి కారణాలను విశ్లేషించే ప్రయత్నం చేశారట.
ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు..! పిచ్చి పీక్స్ చేరుకున్న వైనం..!!
పనిలో పనిగా తమకు వెన్నుపోటు పొడిచిన మిత్రుల ముచ్చుట్లు.. ఓడితే తమ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందనేది అంశాన్ని కూడా పార్టీ దృష్టికి తీసుకెళ్లారట. ఒకవేళ తాము ఓడి పార్టీ అధికారంలోకి వస్తే.. కాంట్రాక్టులు, నామినేటెడ్ పోస్టుల్లో తమకు అవకాశం ఇవ్వాలంటూ బతిమిలాడుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది. బయట జరుగుతున్న చర్చల ప్రకారం ఇలా.. ఓడితే రోడ్డున పడేవారిలో జగన్, చంద్రబాబు ఇద్దరికీ కుడి, ఎడమభుజాలుగా భావించే నేతలు కూడా ఉండటమే పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ఎన్నికల సరళి.. పోలింగ్ తీరు.. గెలుపు అంచనాలు అందక.. అధినేతలే జుట్టుపీక్కుంటుంటే.. ఈ నేతల గురించి ఇప్పుడు ఆలోచించే తీరిక వారికి ఎక్కడ అంటున్నారు విశ్లేషకులు.