‘స్థానికం’లో బీజేపీ-జనసేన పోరు: దెబ్బతీసేందుకు జగన్ సర్కారు ఇలా అంటూ పురంధేశ్వరి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసే పోటీ చేయాలని బీజేపీ-జనసేన పార్టీలు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం విజయవాడలో ఇరుపార్టీల నేతలు సమావేశమయ్యారు. సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టోపై ప్రధానంగా చర్చించారు. బీజేపీ నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోమువీర్రాజు, ఆదినారాయణ రెడ్డి, జనసేన పార్టీ నుంచి నాదెండ్ల మనోహర్, శివశంకర్ తదితరులు హాజరయ్యారు.

ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకే..
ఈ భేటీ అనంతరం పురంధేవ్వరి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పనిచేస్తాయని, సమన్వయ కమిటీలతో ముందుకెళ్తామని చెప్పారు. తమ కూటమిని ప్రజలు ఆశీర్వదిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలను దెబ్బతీయడానికే ఇంత తొందరగా ఎన్నికలు నిర్వహిస్తున్నారని వైసీపీ సర్కారుపై మండిపడ్డారు.

వైసీపీ సర్కారు కక్షపూరితం..
వాలంటీర్ వ్యవస్థను పెట్టుకుని వైసీపీ ఎన్నికలకు వెల్తోందని, ఈ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. ఉమ్మడి ప్రణాళికలతో ప్రజలకు మేలు జరిగేలా ముందుకెళ్తామని చెప్పారు. గ్రామాల్లో, పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అందుకు కారణం కేంద్ర సహకారం ఉందన్న విషయం ప్రజలందరికీ తెలుసని పురంధేశ్వరి చెప్పారు. జిల్లా, అసెంబ్లీ, మండల స్థాయిల్లో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వైసీపీ సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని పురంధేశ్వరి చెప్పారు.
Recommended Video


12న బీజేపీ-జనసేన మేనిఫెస్టో..
అనంతరం జనసేన నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. మార్చి 12న బీజేపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేస్తామని తెలిపారు. బీజేపీ-జనసేన పార్టీలు కలిసి అన్ని స్థానాల్లో పోటీ చేస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగడతామని అన్నారు. తాము వైసీపీకి ఎంత దూరమో టీడీపీకి అంతే దూరమని వ్యాఖ్యానించారు. ప్రజలు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని ఓట్లు వేయాలని నాదెండ్ల కోరారు.












Click it and Unblock the Notifications