మీరు జీవం పోశారు.. ఇప్పుడు రోడ్డున పడ్డాం.. మీరే ఆదుకోవాలి: జగన్ ను కలిసిన బాధితులు
చౌక ధరల దుకాణాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది.
పేదలకు అందించే రేషన్ సరుకుల చౌక ధరల దుకాణాలు.. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మూసివేతకు గురయ్యాయని ఆరోపించారు. వాటిని తిరిగి తెరిపించామని, డోర్ డెలివరీ సిస్టమ్ లో ఉన్న అక్రమాలకు అడ్డుకట్ట వేశామని అన్నారు. అ క్రమంలో ఇంటింటికీ రేషన్ పంపిణీ పథకానికి తెరదించారు.

దీని ప్రభావం మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ ఆపరేటర్లపై పడింది. ప్రభుత్వం చేపట్టిన మార్పుల్లో వాళ్లు తమ ఉపాధిని కోల్పోవాల్సి వచ్చింది. ఇంటింటికీ రేషన్ సరుకుల పంపిణీని నిలిపివేయడం వల్ల దాదాపుగా 20,000 మందికి పైగా ఉపాధిని కోల్పోయామంటూ ఏపీ ఎండీయూ ఆపరేటర్ల సంఘం ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఈ నేపథ్యంలో ఏపీ ఎండీయూ యూనియన్ కృష్ణా జిల్లా ప్రతినిధులు ఈ మధ్యాహ్నం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. వినతిపత్రాన్ని అందజేశారు. తాము ఎదుర్కొంటోన్న పరిస్థితుల గురించి వివరించారు.
ప్రజల వద్దకు ఇంటింటికీ నిత్యావసర సరుకులు అందించాలన్న ఉద్దేశంతో ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్ధను ఏర్పాటు చేసి 9,260 మంది కుటుంబాలకు ఉపాధి కల్పించి తమను ఆదుకున్నది జగనేనని ఆపరేటర్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం తమను అన్యాయం చేసిందని ఆరోపించారు.
ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్ధను తొలగించి తమ జీవనోపాధి లేకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమతో పాటు దాదాపు 10,000 మంది హెల్పర్స్ కుటుంబాలు కూడా కూటమి ప్రభుత్వ నిర్వాకంతో రోడ్డున పడ్డాయని ఆపరేటర్లు జగన్ వద్ద తమ గోడు వెల్లబోసుకున్నారు. ఎండీయూ ఆపరేటర్లకు అండగా ఉంటానని ఈ సందర్భంగా జగన్ భరోసానిచ్చారు.
అనంతరం ఎండీయూ యూనియన్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు శ్యాంబాబు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎండీయూ ఆపరేటర్లను నిలువునా ముంచిందని, ప్రభుత్వ నిర్ణయం వల్ల వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. ఎండీయూ ఆపరేటర్లు ఉన్న సమయంలో రైస్ పక్కదోవ పట్టాయని ఆరోపించారని, ఇప్పుడు రాష్ట్రంలో అనేక చోట్ల రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు.
ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు ఏం సమాధానం చెబుతారని శ్యాంబాబు నిలదీశారు. తమకు వెహికిల్ లోన్స్ క్లియర్ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ పని చేయట్లేదని ధ్వజమెత్తారు. ప్రజాపంపిణీ వ్యవస్ధను నిర్వీర్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు రేషన్ షాప్ల వద్ద క్యూలైన్స్లో నిల్చోలేకపోతున్నారని, పైగా సర్వర్లు పనిచేయడం లేదని డీలర్లు తిప్పించుకుంటున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications