చిరు, జగన్ భేటీపై మంత్రి బాలినేని క్లారిటీ- చిరు, పవన్ మధ్య చిచ్చు విమర్శలపైనా
ఏపీలో సినిమా టికెట్ల రేట్లకు సంబంధించి నెలకొన్న వివాదంపై చర్చించేందుకు తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీకి తనను జగన్ ఆహ్వానించారని చిరు చెప్పడంతో దీనిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా చిరుకు రాజ్యసభ సీటు ఇవ్వబోతున్నారని కొందరు, నరసాపురం నుంచి రఘురామకృష్ణంరాజుపై పోటీ పెడుతున్నారని మరికొందరు చర్చించుకోవడం మొదలుపెట్టారు. దీనిపై స్పందించిన చిరంజీవి,.. ఏపీ ప్రభుత్వం నుంచి అలాంటి ఆఫర్ ఏదీ తనకు ఇవ్వలేదని చెప్పేశారు. అయినా దీనిపై రూమర్లు ఆగలేదు.
వైఎస్ జగన్- చిరంజీవి భేటీపై నెలకొన్న ఊహాగానాలపై తాజాగా ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. సినిమా వాళ్లకి ఉన్న ఇబ్బందులు గురించి చెప్పడానికి మాత్రమే జగన్ను చిరంజీవి కలిశారని తెలిపారు. కొంత మంది దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశ్రు. సినిమా వాళ్ల తరపున వచ్చి చిరంజీవి కలిస్తే ఏదో ఒకటి పులమాలని చూస్తున్నారన్నారని బాలినేని వివరించారు.
అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన అన్న చిరంజీవికీ చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలపైనా బాలినేని రియాక్ట్ అయ్యారు. చిరంజీవి, పవన్ కళ్యాన్ మధ్య చిచ్చు పెట్టే ఆలోచన జగన్కి లేదని తేల్చిచెప్పారు. పార్టీ పెట్టినప్పటి నుండి జగన్ ఒంటరిగానే పోటీ చేస్తున్నారనన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రమే దళితులు, కాపుల మధ్య చిచ్చుపెడుతుంటారని మంత్రి బాలినేని శ్రీనివాస్ ఆరోపించారు. బాలినేని తాజా క్లారిటీ తర్వాత అయినా చిరంజీవి-జగన్ భేటీపై చర్చ ఆగుతుందేమో చూడాల్సి ఉంది.