Botsa Satyanarayana: మంత్రి బొత్సకు హార్ట్ సర్జరీ సక్సెస్-నెల రోజుల విశ్రాంతి..
గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు ఇవాళ హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ఇది విజయవంతం అయినట్లు డాక్టర్లు ప్రకటించారు. తాజాగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సమయంలో అనారోగ్యానికి గురికావడంతో బొత్సను ఆస్పత్రికి తరలించారు. ఆయనకు ఆపరేషన్ అవసరమని తేలడంతో ఇవాళ హైదరాబాద్ లో విజయవంతంగా నిర్వహించారు.
తాజాగా విజయనగరం జిల్లా ఎస్.కోటలో వైసీపీ నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొన్న బొత్స సత్యనారాయణ అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు.. ప్రాధమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు తరలించారు. అక్కడ ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం అని తేలడంతో ఇవాళ డాక్టర్లు ఆపరేషన్ నిర్వహించారు.

ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న మంత్రి బొత్స సత్యనారాయణకు డాక్టర్లు నెల రోజుల పాటు ఆస్పత్రిలోనే విశ్రాంతి అవసరమని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన హైదరాబాద్ లోని ఆస్పత్రికే పరిమితం అయ్యే అవకాశాలున్నాయి. అనంతరం డిశ్చార్జ్ అయ్యాక హైదరాబాద్ లోని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటారని తెలుస్తోంది. గతంలో ఉమ్మడి ఏపీలో మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఉన్న బొత్స.. ఏపీలో మంత్రిగా ఉన్నప్పటికీ ఇప్పటికీ అక్కడే ఎక్కువగా ఉంటున్నారు. వైసీపీ కార్యక్రమాలు ఉన్నప్పుడు విజయనగరంలో, మంత్రిగా అధికారిక కార్యక్రమాలు ఉన్నప్పుడు అమరావతిలో ఉంటున్నారు.












Click it and Unblock the Notifications