మంత్రి దాడిశెట్టి రాజా షాకింగ్ కామెంట్స్-అప్పులపై మాట్లాడితే చెప్పుతో..వాలంటీర్స్ మా వాళ్లేగా !
ఏపీలో నిత్యం తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న రోడ్లు, భవనాల మంత్రి దాడిశెట్టి రాజా తాజాగా మరో సంచలనం రేపారు. వైసీపీ ప్రభుత్వం నియమించిన వాలంటీర్లతో పాటు ప్రభుత్వం చేస్తున్న అప్పులను విమర్శిస్తున్న వారిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తునిలో స్ధానికంగా జరిగిన సచివాలయ కన్వీనర్ల భేటీలో దాడిశెట్టి రాజా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
ఏపీలో అప్పులపై ఎవరైనా అబద్దాలు మాట్లాడితే చెప్పుతో కొట్టాలంటూ మంత్రి దాడిశెట్టి రాజా వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తుని నియోజకవర్గంలో రాజకీయ ప్రత్యర్ధిగా ఉన్న టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పులపై టీడీపీతో పాటు ఆ పార్టీకి అండగా ఉన్న మీడియా సంస్ధలు రాద్ధాంతం చేస్తున్నాయని రాజా ఆరోపించారు. మూడున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు కేవలం 1.30 లక్షల కోట్లేనని మంత్రి తెలిపారు. టీడీపీ హయాంలో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధకు తూట్లు పొడిచారని, దీనిపై మాజీ ఆర్ధికమంత్రి యనమలతో చర్చకు తాను సిద్ధమన్నారు.

మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైనా దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పేరెత్తకుండానే, ఓ సినీ నటుడు తాను చెల్లించిన పన్నుల్ని సీఎం జగన్ సంక్షేమ పథకాల ద్వారా పంచిపెడుతున్నట్లు మాట్లాడుతున్నారని దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు. మరోవైపు వాలంటీర్ల వ్యవస్ధపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలేనని, కోర్టులు వారిని పార్టీ పనులకు వాడొద్దని చెప్పడంతో సచివాలయ కన్వీనర్లను నియమిస్తున్నట్లు మంత్రి దాడిశెట్టి చెప్పుకొచ్చారు. అలాగే సచివాలయ కన్వీనర్లకు ప్రభుత్వం ద్వారా లబ్ది చేకూరుస్తామని, తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం బాగా చూసుకుంటానని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications