విజయవాడ కోర్టుకు వైసీపీ మంత్రి డుమ్మా-ఫోర్జరీ పత్రాల కేసు విచారణ వాయిదా
ఏపీలో వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఫోర్జరీ పత్రాల కేసు వెంటాడుతోంది. నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఉంటూ ప్రత్యర్ధి పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఫోర్జరీ పత్రాలను సృష్టించిన వ్యవహారంలో ఆయనపై స్ధానిక కోర్టులో కేసు విచారణ జరుగుతుండగా కీలక వరిణామాలు చోటు చేసుకున్నాయి. కోర్టులో ఆయనకు వ్యతిరేకంగా పోలీసులు సమర్పించిన ఆధారాలు దొంగతనానికి గురయ్యాయి. దీంతో నెల్లూరు కోర్టు నుంచి విజయవాడ కోర్టుకు ఈ కేసును బదిలీ చేశారు.
ఏపీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి తనపై ఆరోపణలు చేశారన్న సోమిరెడ్డి పిటిషన్పై విజయవాడ ప్రత్యేక కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. అయితే ఈరోజు విచారణకు మంత్రి కాకాణి హాజరుకాకపోవడంతో మే 13న తదుపరి విచారణకు హాజరుకావాలని కాకాణితో సహా నలుగురికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కోర్టు వాయిదాలకు కాకాణి హాజరుకాకపోవడాన్ని పిటిషనర్ అయిన తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తప్పుపట్టారు.
కేసు విచారణకు వచ్చేసరికి ఆధారాలు మాయం చేయొచ్చు అంటూ దొంగలు, క్రిమినల్స్ కు మంత్రి కాకాణి రోల్ మోడల్గా నిలిచారని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. న్యాయస్థానాల్లో ఆధారాల భద్రత, పతిష్ఠ ఏర్పాట్లుపైనా సరికొత్త చర్చ నడుస్తోందన్నారు.

మరోవైపు ఈ కేసులో ఆధారాల మాయంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఇద్దరు దొంగల్ని అరెస్టు చేసిన పోలీసులు.. వారే ఈ ఆధారాలను దొంగిలించారని ప్రకటించారు. అయితే ఈ మాటల్ని నమ్మే పరిస్ధితి లేదు. దీంతో నెల్లూరు పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అటు విజయవాడ కోర్టుకు హాజరుకావాల్సిన కాకాణి డుమ్మా కొట్టడంతో తదుపరి విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది. నెల్లూరులో పోలీసులు ఆ లోపు ఆధారాలు సంపాదించగలిగితేనే కాకాణికి వ్యతిరేకంగా కోర్టులో కేసు నిలిచే అవకాశముంది.












Click it and Unblock the Notifications