పవన్పై పేర్నినాని సెటైర్లు- చిడతల నాయుడు అండ చంద్రబాబుకే- చిరంజీవికీ దక్కలేదంటూ
నిన్న కృష్ణాజిల్లా పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ మంత్రులపై చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. పవన్ వ్యాఖ్యలపై మంత్రులు ఇవాళ వరుసగా విమర్శలకు దిగుతున్నారు. ఇదే క్రమంలో ఉదయం మంత్రి కొడాలి నాని పవన్ వ్యాఖ్యలపై తీవ్రంగా కౌంటర్ ఇచ్చారు. ఇదే క్రమంలో మరో మంత్రి పేర్నినాని కూడా పవన్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. పవన్పై పేర్నినాని సెటైర్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రైతులకు అండగా ఉంటానన్న పవన్ .. జీవితంలో చంద్రబాబుకు తప్ప కనీసం అన్న చిరంజీవికి సైతం అండగా ఉండలేకపోయారని పేర్నినాని వ్యాఖ్యానించారు.

కొడాలి పేరెత్తడానికీ పవన్కు భయం
నిన్న హైదరాబాద్ నుంచి ప్రయాసపడి బెజవాడ వచ్చిన చిడతల నాయుడు ఆ తర్వాత గుడివాడ, బందరు వచ్చారరని, గుడివాడలో కొడాలి నాని పేరెత్తడానికి కూడా భయపడ్డారని మంత్రి పేర్నినాని వ్యాఖ్యానించారు.. తానో అమాయక జీవిని కాబట్టి బందరులో ఎమ్మెల్యే ఎవరని అడిగారని, గుడివాడలో మాత్రం ఆ ప్రశ్న వేయలేకపోయారన్నారు. ఆయన ఆటలో అరటిపండని తాము మాట్లాడటం మానేశామన్నారు. విశాఖలో వైఎస్ గురించి దారుణంగా మాట్లాడింది ఎవరని పవన్ను పేర్నినాని ప్రశ్నించారు. పవన్ అందరి గురించి మాట్లాడొచ్చని, కానీ ఆయన్ను ఎవరూ ఏమీ అనకూడదా అని ప్రశ్నించారు.

నీ అండ చంద్రబాబుకే.. చిరంజీవికీ కాదు
బందరు వచ్చి తన ఇంటికి వస్తానని పవన్ చేసిన బెదిరింపులపై పేర్నినాని మండిపడ్డారు. చంద్రబాబు ఇంటికెళ్తే ఓ సూట్ కేస్ ఇచ్చి పంపిస్తారని, నా ఇంటికొస్తే ఏమొస్తుందని పవన్ను పేర్నినాని ప్రశ్నించారు. ఆరు షూటింగ్లకు కాల్షీట్లు ఇచ్చిన వ్యక్తి తుపాను బాధితులకు ఎలా అండగా ఉంటారో చెప్పాలని ప్రశ్నించారు. తనను నమ్ముకున్న అమరావతి రైతులను మోసం చేసి చంద్రబాబుతో చేతులు కలపలేదా అని గుర్తుచేశారు. చంద్రబాబుకు మినహా ఎవరికి అండగా నిలబడ్డావని ప్రశ్నించారు. అన్న చిరంజీవికి సైతం మీరు అండగా నిలవలేకపోయారని పేర్నినాని చురకలు అంటించారు.

మోడీకి నకిలీ వకీల్ సాబ్ చెప్పాల్సిందిదే...
వైసీపీ కార్యకర్త కూడా నిన్ను చూసి భయపడరని పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి మంత్రి పేర్నినాని వ్యాఖ్యానించారు. రోడ్డుమీదకు రావడం తనకు సరదా కాదని పవన్ చెప్తున్నారని, ఆయనకు సరదా కాదని లాభమేనని తాము చెప్తున్నామన్నారు. శతకోటి లింగాల్లో తానో బోడిలింగమని, కానీ మీరు సహస్రకటి నాయుళ్లలో బోడి నాయుడంటూ పవన్పై నాని తీవ్రంగా విరుచుకుపడ్డారు. రైతులకు మోడీ రెండు వేలు ఇచ్చారని చెప్తున్న నకిలీ వకీల్ సాబ్.. 70 లక్షల మంది కౌలు రైతులకు డబ్బులివ్వని విషయాన్ని మోడీకి చెప్పాలని సూచించారు. దళితులు, ఎస్టీలు, బీసీలకు మోడీ డబ్పులు ఇవ్వడం లేదన్నారు. మోడీకి ఓసారి చిడతలు కొట్టి, మరోసారి విమర్శలు చేయడం మీకే సాధ్యమైందని, కానీ తాను అలా కాదని జగన్కు, వైఎస్ కుటుంబానికి నేను బతికున్నంతవరకూ చిడతలు వాయిస్తానని మంత్రి పేర్నినాని స్ఫష్టం చేశారు. పవన్ గతంలో మోడీని ఎలా నెత్తిన పెట్టుకున్నారో, ఆ తర్వాత పాచిపోయిన లడ్డూల పేరుతో ఎలా తిట్టారో, ఆ తర్వాత కమ్యూనిస్టులను ఎలా మోశారో, ఎన్నికల తర్వాత ఎలా వదిలేశారో ప్రజలు చూశారన్నారు. పవన్ ఇలాంటి పనులు వదిలిపెట్టి ఇప్పటికైనా మోడీని అడగాల్సిన విషయాలు అడగాలని పేర్నినాని సూచించారు.

సినిమాలు ఎవరు వద్దొన్నారు ?
తప్పులు దిద్దుకోవడానికి జగన్కు టైమ్ ఇస్తున్నానన్న పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ పేమెంట్స్ తీసుకుని చేసే వ్యాఖ్యలు ఆపి నిజాయితీగా మాట్లాడాలని సూచించారు. సినిమాలు మానేయాలని పవన్కు ఎవరు చెప్పారని, ప్రజలకు ఏమీ తెలియదని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని పేర్నినాని తెలిపారు. సినిమాలు వదిలేసి ఏడాదికి వంద కోట్ల ఆదాయం కోల్పోతున్నట్లు పవనే చెప్పుకున్నారని గుర్తుచేశారు. ఆయన గతంలో చెప్పుకోవడం వల్లే ఇప్పుడు జనం తిరిగి ఆయన్ను ప్రశ్నిస్తున్నారని, ఆ కోపం వైసీపీ నేతలపై చూపడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications