సీఎం జగన్ ఒక్కరికే సాధ్యం - మూడో రోజు మంత్రుల యాత్ర : టార్గెట్ చంద్రబాబు..!!
రాష్ట్రంలో ఎవరూ ఏదీ కోరకపోయినా..ఎవరికి ఏం కావాలో తెలుసుకున్న సీఎం జగన్ అందరికీ అన్నీ అందించారని మంత్రులు పేర్కొన్నారు. వైసీపీ సామాజిక న్యాయభేరీలో భాగంగా మూడో రోజు బస్సు యాత్ర తాడేపల్లి గూడెం నుంచి బయల్దేరింది. ఈ రోజు పల్నాడు జిల్లా నర్సరావుపేట వరకు యాత్ర కొనసాగనుంది. సాయంత్రం నర్సరావుపేటలో బహిరంగసభలో మంత్రులు ప్రభుత్వం సామాజిక న్యాయం అమల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలు..అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించనున్నారు.
అదే సమయంలో మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు.. పార్టీ నేతల ప్రసంగాలు..ప్రభుత్వం పైన విమర్శలకు మంత్రులు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. కేబినెట్లో 17 మంది ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ మంత్రులు ఉన్నారని..తామంతా సీఎం జగన్ తయారు చేసిన సైనికులమని మంత్రి మేరుగ నాగార్జున చెప్పుకొచ్చారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా..సీఎం జగన్ ఒక్కరే సామాజిక న్యాయం పాటించారని మరో మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ సంక్షేమ సామ్రాజ్యాన్ని సృష్టించారని మంత్రి విడదల రజనీ వివరించారు.

వాలంటీర్ వ్యవసస్థ నుంచి మంత్రివర్గం వరకు ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికి రాష్ట్రంలో సీఎం జగన్ ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చారో అందరికీ తెలుసన్నారు. తన మంత్రి వర్గంలో సీఎం జగన్ 70శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశం ఇస్తే, అందులో పదిమంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిన నాయకుడు జగన్ అని..రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కూడా గొప్పగా అమలు అవుతున్నాయన్నారు.
గతంలో ఎన్నడూ, ఎప్పుడూ, ఏ నాయకుడు చేయని మంచిని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు మా జగనన్న చేశాడని మీ అందరికీ చెప్పేందుకే మీ ముందుకు వచ్చామంటూ రజనీ వివరించారు. ఈ మూడేళ్ల పాలనలో ఒక్క తప్పును కూడా చంద్రబాబు చూపలేకపోతున్నారంటూ మంత్రులు దుయ్యబట్టారు. కరోనా మహమ్మారితో ప్రపంచమే అల్లకల్లోలమైనా, ఇక్కడ ఏ ఒక్క పథకాన్ని ఆపలేదని.. నిరుపేదలకు ఆర్థిక సహాయం అందిందని మంత్రులు వివరించారు. మంత్రుల బస్సు యాత్రలో బాగంగా.. స్థానిక నేతలు సైతం వారి సభల్లో పాల్గొంటున్నారు.












Click it and Unblock the Notifications