ఆ వర్గాలకు దగ్గరవ్వటమే లక్ష్యంగా - మంత్రుల బస్సు యాత్ర : నేటి నుంచి ప్రారంభం..!!
ఏపీలో వచ్చే ఎన్నికల కోసం అధికార పార్టీ వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే గడప గడపకు ప్రభుత్వం పేరుతో ప్రజల వద్దకు వెళ్లి..ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరిస్తున్న పార్టీ నేతలు.. ఇప్పుడు ఈ రోజు నుంచి మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్న వైసీపీ ప్రభుత్వం..ఇప్పుడు చేసింది చెప్పుకుంటూ వారికి వివరించే ప్రయత్నం మొదలు పెట్టింది. అందులో భాగంగా.. నేటి నుంచి సామాజిక న్యాయభేరీ పేరి బస్సు యాత్ర ప్రారంభిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ఈ యాత్ర ప్రారంభం కానుంది. నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా దీనిని కొనసాగిస్తున్నారు.
17 మంది మంత్రులతో యాత్ర
ఇందులో కేబినెట్ లో మంత్రులుగా ఉన్న ఎస్సీ-బీసీ -ఎస్టీ-మైనార్టీ మంత్రులు పాల్గొంటారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రులు విస్తృత ప్రచారం చేయనున్నారు. మొత్తం 17 మంది మంత్రులు ఈ యాత్రలో పాల్గొననున్నారు. తొలిరోజు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఏడు రోడ్ల కూడలిలో ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి యాత్ర ప్రారంభిస్తారు. ఎచ్చెర్ల, రణస్థలం మీదుగా విజయనగరం వెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో మంత్రులు మాట్లాడతారు. అనంతరం బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు, కె.నారాయణస్వామి, తానేటి వనిత, అంజాద్ బాషా, రాజన్నదొర, బూడి ముత్యాల నాయుడు, పినిపె విశ్వరూప్, కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేశ్, మేరుగ నాగార్జున, గుమ్మనూరు జయరాం, ఆదిమూలపు సురేష్, విడదల రజని, ఉషశ్రీ చరణ్ పాల్గొననున్నారు.
మూడేళ్ల కాలంలో తీసుకున్న నిర్ణయాలతో
27న విశాఖలో బయలుదేరి గాజువాక, లంకెలపాలెం కూడలి, అనకాపల్లి జంక్షన్, తాళ్లపాలెం జంక్షన్, యలమంచిలి వై జంక్షన్, నక్కపల్లి, కత్తిపూడి, జగ్గంపేట మీదుగా రాజమహేంద్రవరం చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభ నిర్వహించి రాత్రికి తాడేపల్లిగూడెం వెళ్లి అక్కడే బస చేస్తారు. 28న నారాయణపురం, ఏలూరు బైపాస్, హనుమాన్ జంక్షన్, గన్నవరం, విజయవాడ తూర్పు, మంగళగిరి, గుంటూరు ఆటోనగర్, చిలకలూరిపేట మీదుగా నరసరావుపేట చేరుకుని బహిరంగ సభ నిర్వహిస్తారు. నంద్యాలలో రాత్రి బస చేస్తారు. 29న పాణ్యం, కర్నూలు, డోన్, వెల్దుర్తి, గుత్తి, పామిడి, గార్లదిన్నె మీదుగా అనంతపురం వెళ్లి అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. దీంతో..బస్సు యాత్ర ముగియనుంది. గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి వర్గాలకు ఏ రకంగా ప్రాధాన్యత దక్కిందీ...ఇప్పుడు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తుందీ ఈ యాత్ర - సభల ద్వారా ప్రధానంగా వివరించనున్నారు.
ఆ వర్గాలకు మరింత దగ్గరయ్యేలా
యాత్రలో ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ పదవులు పొందిన వారు పాల్గొని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు.. అమలు చేస్తున్న సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరించనున్నారు. 2024 ఎన్నికల ముందు ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ వర్గాలు ప్రధానంగా వైసీపీకి అండగా నిలుస్తాయనే నమ్మకంతో ఉన్న పార్టీ నేతలు..వీరికి మరింత దగ్గరయ్యేందుకు ఈ యాత్ర ద్వారా ముందుకు సాగుతున్నారు. గడపగడపకు ప్రభుత్వ కార్యక్రమంలో తొలి రెండు రోజుల్లో ప్రజల నుంచి సమస్యల పైన సమాధానం చెప్పుకోవటంలో అధికార పార్టీ నేతలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక, ఇప్పుడు ఈ బస్సు యాత్రకు ఎటువంటి స్పందన వస్తుందనేది చూడాలి.