'స్మార్ట్ సిటీ' ట్విస్ట్: బాబు లాబీయింగ్, ఆశల్లేని టీ!
హైదరాబాద్: స్మార్ట్ సిటీల కోసం రెండు తెలుగు రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నా, కేంద్రం ప్రతిపాదనలు మాత్రం పెదవి విరిచే విధంగా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. స్మార్ట్ సిటీలపై కేంద్రం నిర్వహించిన సమావేశానికి రెండు రాష్ట్రాల ఉన్నతాధికార్లు హాజరయ్యారు. సమావేశానికి వెళ్లివచ్చిన తెలంగాణ స్మార్ట్ సిటీల కోసం కేంద్రంపై పెద్దగా ఆశలు పెట్టుకునే పరిస్థితి కనిపించడం లేదని చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా వంద స్మార్ట్ సిటీలను నిర్మించనున్నట్టు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నరేంద్ర మోడీ ప్రకటించారు. స్మార్ట్ సిటీలను దక్కించుకోవడం ద్వారా పెద్ద ఎత్తున కేంద్రం నుంచి ఆర్థిక సాయం పొందవచ్చని ఇరు రాష్ట్రాలు భావించాయి. తెలంగాణలో కరీంనగర్, వరంగల్ నగరాలను స్మార్ట్ సిటీలుగా మార్చాలనే ప్రతిపాదనలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా స్మార్ట్ సిటీలుగా 14 ప్రాంతాల పేర్లు ముందుకు వచ్చాయి.
స్మార్ట్ సిటీల నిర్మాణానికి కేంద్రం నుంచి భారీ ఆర్థిక సాయం అందుతుందేమోనని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆశించాయి. అయితే స్మార్ట్ సిటీల స్వరూపం గురించి ఢిల్లీలో జరిగిన సమావేశంలో వివరించారు. ఆర్థిక వ్యవహారం విషయానికి వస్తే మాత్రం ప్రతిపాదన పెదవి విరిచేట్టుగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పిపిఏ)తో స్మార్ట్ సిటీలు నిర్మించుకోవాల్సి ఉంటుందని కేంద్రం వివరించింది. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర రాజధాని సమీపంలోనే స్మార్ట్ సిటీ నిర్మించారు.
అయితే ఇది కూడా పిపిఏ విధానంలోనే నిర్మించారు. కేంద్రం వివరించిన దాని ప్రకారం స్మార్ట్ సిటీల్లో సౌకర్యాలు, ప్రజలకు కనీస సదుపాయాలు, ప్రభుత్వం పని తీరు, రవాణా సదుపాయాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ స్వరూపం అద్భుతంగానే ఉన్నా పిపిఏ విధానంతో నిర్మించుకోవాలని చెబుతున్నారు. మరోవైపు, స్మార్ట్ సిటీల్లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం ఏమేరకు ఉంటుందో తేలాలి.
కాగా, 40 లక్షల జనాభా కేటగిరీ కింద ఏపీలో ఏ నగరానికి కూడా స్మార్ట్ సిటీ అర్హత ఉండదంటున్నారు. ఏపీలో 14 నగరాలను స్మార్ట్ సిటీలుగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఏపీలోను పదమూడు జిల్లాల్లో పద్నాలుగు నగరాలను స్మార్ట్ సిటీలుగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో కొన్ని జిల్లాల్లో రెండు నగరాలు కూడా ఉన్నాయి.
చిత్తూరు జిల్లాలో చిత్తూరు, తిరుపతి, తూర్పు గోదావరిలో రాజమండ్రి, కాకినాడ, పశ్చిమ గోదావరిలో ఏలూరు, బీమవరంలు ఉన్నాయి. ఈ నగరాలు పది లక్షల జనాభా కంటే తక్కువగా ఉన్న స్మార్ట్ సిటీ కేటగీరిలో ఉండే అవకాశముంది. ఏపీలోని స్మార్ట్ సిటీ నగరాలను కేంద్రం ఫైనలైజ్ చేయాల్సి ఉంది. అయితే, పద్నాలుగు నగరాల కోసం చంద్రబాబు లాబీయింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. విశాఖ, విజయవాడ నగరాలు 10-40 లక్షల జనాభా కేటగిరీ స్మార్ట్ సిటీలో ఉంటాయని తెలుస్తోంది.