ఏపీ పరిషత్ పోరు- చెదురుమదురు ఘటనలు- 11 గంటలకు 21.65 శాతం
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనా తొలి రెండు గంటల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో చాలా జిల్లాల్లో తొలి రెండు గంటల్లో పది శాతం పోలింగ్ కూడా నమోదు కాలేదు. 11 గంటల సమయానికి మాత్రం 21.65 శాతం పోలింగ్ నమోదైంది.
Recommended Video
ఉదయం 11 గంటల సమయానికి వివిధ జిల్లాల్లో నమోదైన పోలింగ్ వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. దీని ప్రకారం చూస్తే అత్యధికంగా కర్నూలు జిల్లాలో 25.96 శాతం పోలింగ్ నమోదైంది.. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 15.05 శాతం పోలింగ్ నమోదైంది. విజయనగరం, విశాఖ, గోదావరి జిల్లాలతో పాటు నెల్లూరు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోనే పోలింగ్ శాతాలు 20 దాటాయి. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో సైతం ఉదయం 11 గంటలకు 20 శాతం పోలింగ్ కూడా నమోదు కాలేదు.
ఈసారి పరిషత్ పోరును బహిష్కరించినట్లు టీడీపీ ప్రకటించినా పలు జిల్లాల్లో ఆ పార్టీ తరఫున రంగంలో అభ్యర్ధులకు ఓట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ధిక్కరించి తాము బరిలో ఉంటామని పలువురు అభ్యర్ధులు, నేతలు ఇప్పటికే ప్రకటించారు. దీంతో చేసేది లేక టీడీపీ కూడా ఈ విషయంలో చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తోంది. అటు బరిలో ఉన్న ప్రధాన పార్టీ వైసీపీతో పాటు జనసేన, బీజేపీ, కమ్యూనిస్టుల తరఫున అభ్యర్ధులు పలు చోట్ల పోటీపడుతున్నారు.
పరిషత్ పోరులో పలుచోట్ల అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇతరత్రా సమస్యలతో పోలింగ్కు కొన్ని చోట్ల అవాంతరాలు ఎదురయ్యాయి. గుంటూరు జిల్లా దాచేపల్లిలో జనసేన ఏజెంట్లను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. నరసరావుపేట గోనేపూడిలో పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా ఓటర్లను వైసీపీ అడ్డుకుంటోందని టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. నెల్లూరు జిల్లా ఎస్ఎన్పేట మండలం పొనుగోడులో బీజేపీ ఏజెంట్ బ్యాలెట్ బాక్సును నీళ్లలో వేయడంతో ఎన్నికలు నిలిచిపోయాయి. విశాఖ జిల్లా పెదబయలు మండలం సీతగుంటలో సీపీఐ ఎంపీటీసీ అభ్యర్ధి గుర్తు మారిందని ఆందోళనకు దిగారు. విజయనగరం జిల్లా ద్వారపూడి పోలింగ్ కేంద్రంలో ఓటరు స్లిప్పుల పంపిణీలో వివాదంతో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం పోతలపాడులో ఏజెంట్ల మధ్య వివాదంతో తాత్కాలికంగా పోలింగ్ నిలిచిపోయింది. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం అంకాలగూడెంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్ధి గడ్డియ్య రోడ్డు పక్కన గాయాలతో పడిపోయి ఉండటంతో వైసీపీ వర్గీయులపై విమర్శలు వచ్చాయి.
అనంతపురం జిల్లా ధర్మవరం మండలం రేగాటిపల్లిలో జనసేన నేత మధుసూధన్రెడ్డి ఇంటిపై వైసీపీ నేతలు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ దాడిలో మధుసూధన్ కారు ధ్వంసమైంది. చిత్తూరు జిల్లా నిండ్ర మండలం కీళంబాకంలో టీడీపీ అభ్యర్ధులు పోటీలో లేకపోవడంతో గ్రామస్ధులు ఎన్నికలు బహిష్కరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పేపర్ బయటికి తెచ్చారంటూ టీడీపీ అభ్య్రర్ధిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా చెరుకూరు ఎంపీటీసీ 1 స్ధానంలో బ్యాలెట్ సమస్యలతో పోలింగ్ నిలిచిపోయింది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రామాపురంలో తాండావాసులు తమ గ్రామాన్ని పంచాయతీ కేంద్రంగా చేయకపోవడంతో ఎన్నికలు బహిష్కరించారు.