ఏపీలో రేపు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు- 18న మేయర్లు, ఛైర్మన్ల ఎన్నికలు
ఏపీలో హోరాహోరీగా సాగిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది. ఈ మేరకు 12 కార్పోరేషన్లు, 71 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కంపు కోసం ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేస్తోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో కౌంటింగ్ను వీడియో చిత్రీకరణ కూడా చేయనున్నారు. బ్యాలెట్ విధానంలో జరిగిన ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయి అన్ని ఫలితాలు వెలువడాలంటే రేపు సాయంత్రం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత కార్పరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీల్లో ఛైర్మన్ల ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ నిమ్మగడ్డ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏపీలో రేపే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
ఏపీలో 12 కార్పోరేషన్లు, 71 మున్సిపాలిటీల్లో ఈ నెల 10న మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో అధికార వైసీపీతో పాటు విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం అభ్యర్ధులు ప్రధానంగా పోటీ పడ్డారు. మిగతా పార్టీలు కూడా పోటీ చేసినా వాటి ప్రభావం అంతంతమాత్రమే. ఈ నేపథ్యంలో రేపు ఎన్నికల ఓట్ల లెక్కింపుపై అన్ని పార్టీల దృష్టీ నెలకొంది. ముఖ్యంగా ఏపీలో రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత మున్సిపల్ ఎన్నికల పోరే కీలకంగా మారిన నేపథ్యంలో ఇందులో వెలువడే ఫలితాలు ఆయా పార్టీల రాజకీయ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి.
కౌంటింగ్కు ఎస్ఈసీ భారీ ఏర్పాట్లు
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రేపు జరిగే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కోసం ఎన్నికల కమిషన్ భారీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి. కౌంటింగ్ కోసం సిబ్బంది కూడా ఆయా చోట్లకు తరలివెళ్తున్నారు. రేపు ఉదయం 8 గంటలకు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ రాష్టవ్యాప్తంగా ప్రారంభం కానుంది. ముందుగా ఓట్లను చెల్లని, చెల్లే ఓట్లుగా విభజించి ఆ తర్వాత కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఇందుకోసం ఇప్పటికే స్ధానికంగా రిటర్నింగ్ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రస్ధాయిలో కౌంటింగ్ ప్రక్రియను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ సమీక్షిస్తారు.
రేపు సాయంత్రానికి మున్సిపల్ ఫలితాలు
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకే ప్రారంభం అవుతున్నా.. ఫలితాల సరళి తెలిసేందుకు మధ్యాహ్నం కావొచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే తుది ఫలితాలు సాయంత్రానికి లేదా రాత్రికి వెలువడే అవకాశముంది. ఇందులో పోటీలో ఉన్న అభ్యర్ధులు ఎలా్ంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోతే ఫలితాలు త్వరగా వెలువడతాయి. బ్యాలెట్ విధానంలో జరిగిన ఎన్నికలు కావడంతో అభ్యర్ధుల్లో ఓట్ల లెక్కింపుపై ఆందోళన కూడా ఉంటుంది. ఏదేమైనా మధ్యాహ్నం తర్వాత మున్సిపల్ ఎన్నికల ఫలితాల సరళి మాత్రం తెలిసిపోతుంది.
మార్చి 18న మేయర్లు, ఛైర్మన్ల ఎన్నికలు
రేపు రాత్రి కల్లా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పూర్తయి అన్ని ఫలితాలు వెలువడతాయని భావిస్తున్నారు. కాబట్టి రెండు రోజుల విరామం తర్వాత మార్చి 18న కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి సభ్యుల ప్రమాణస్వీకారం పూర్తి చేస్తారు. అదే రోజు మధ్యాహ్నానికి కార్పోరేషన్లలో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లను ఎన్నుకుంటారు. దీంతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది.