ముందస్తుపై జగన్ మళ్లీ సంకేతాలు ? బడ్డెట్ తీరు, కేబినెట్ ప్రకటనతో-విపక్షాల ఉక్కిరిబిక్కిరి
ఏపీలో వైసీపీ ప్రభుత్వాధినేత వైఎస్ జగన్ తీసుకుంటున్న డైనమిక్ నిర్ణయాలు ఇప్పుడు విపక్షాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వైసీపీ నేతలు ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని ఎంత మొత్తుకుంటున్నా విపక్ష టీడీపీ, బీజేపీ మాత్రం ముందస్తులో భాగంగానే ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయని చెప్తున్నాయి. తాజాగా ఏపీ బడ్జెట్, త్వరలో కేబినెట్ విస్తరణ ప్రకటన కూడా ఇందులో భాగంగానే విపక్షాలు అనుమానిస్తున్నాయి.
జగన్ ముందస్తు దూకుడు
ఏపీలో ఈ మధ్య కాలంలో సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు విపక్షాలకే కాదు స్వపక్షంలోని వారికి కూడా మింగుడు పడటం లేదు. ఎప్పుడో మూలన పడేసిన జిల్లాల విభజనను సడన్ గా తెరపైకి తీసుకురావడంతో మొదలుపెడితే, ఆ తర్వాత తీసుకున్న పలు నిర్ణయాలు జగన్ దూకుడును స్పష్టం చేశాయి. మూడు రాజధానుల బిల్లులు వెనక్కి తీసుకోవడం, బడ్డెట్ లో మరింత సంక్షేమాన్ని రంగరించడం, ఇవాళ కేబినెట్ లో మంత్రి వర్గ విస్తరణలో సంకేతాలు ఇచ్చేయడం చూస్తుంటే ఇక మిగిలింది సమయం చూసుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్లిపోవడమే అనే ప్రచారం జరుగుతోంది.
విపక్షాలకు నిద్ర కరవు
విపక్ష పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేనను ఇప్పుడున్న స్ధితిలోనే ఉంచి అదను చూసి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు జగన్ రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో భారీ ప్రచారమే జరుగుతోంది. దీంతో విపక్షాలకు నిద్ర కరవవుతోంది. జగన్ ఇప్పటికే తీసుకున్న ఆకస్మిక నిర్ణయాలు ఓ ఎత్తయితే ఇప్పుడు మూడు రాజధానులతో పాటు కేబినెట్ విస్తరణ, జిల్లాల విభజన వంటి అంశాల్లో తీసుకోబోతున్న నిర్ణయాలు మరికొన్నాళ్ల పాటు కచ్చితంగా విపక్షాలకు నిద్ర లేకుండా చేసే ప్రమాదం పొంచి ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ముందస్తు ఖాయమంటున్న విపక్షాలు
ఏపీలో వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఖాయమని ప్రధాన విపక్షం టీడీపీతో పాటు మరో విపక్షం బీజేపీ కూడా చెబుతోంది. ప్రస్తుత పరిస్ధితుల్లో ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని జగన్ కచ్చితంగా ముందస్తు ఎన్నికలకు అడుగులు వేస్తారని, అందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని టీడీపీ, బీజేపీ నేతలు పిలుపు ఇస్తున్నారు. అసలే నాలుగు రాష్ట్రాల్లో గెలుపుతో ఊపుమీదున్న బీజేపీ.. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే కచ్చితంగా దాన్ని సొమ్ము చేసుకోవచ్చని భావిస్తోంది. ఇదే కోవలో టీడీపీ కూడా జగన్ పై వ్యతిరేకతను నిరూపించేందుకు ముందస్తు ఎన్నికల్ని వాడుకోవాలని యోచిస్తోంది. అందుకే జగన్ తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం వెనుక ఉన్న ముందస్తు ఎన్నికల వ్యూహాన్ని బయటపెట్టే పనిలో విపక్షాలు బిజీగా కనిపిస్తున్నాయి.
మౌనంతో చంపేస్తున్న జగన్ ?
ఏపీలో ముందస్తు ఎన్నికలపై విపక్షాలు ఎంత మొత్తుకుంటున్నా జగన్ మాత్రం పల్లెత్తు మాట మాట్లాడటం లేదు. బహిరంగంగా కాకపోయినా కనీసం పార్టీ అంతర్గత సమావేశాల్లో కానీ, కేబినెట్ సహచరులతో కానీ, చివరికి తన కోటరీతో కానీ దీనిపై చర్చించడం లేదు. కేవలం జూన్ తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని మాత్రమే చెప్తున్నారు. దీంతో విపక్షాలకు జగన్ మౌనం చిర్రెక్కిత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ఏదో విధంగా జగన్ నోట ముందస్తు ప్రకటన చేయించాలన్న పట్టుదలతో విపక్షాలు పదే పదే ఇలా వ్యాఖ్యలు చేస్తున్నాయా అన్న చర్చ కూడా జరుగుతోంది. జూన్ తర్వాత ప్రజల్లోకి వెళ్తామన్న జగన్ వ్యాఖ్యల ఆధారంగా ముందస్తు ఎన్నికలక వ్యూహాలకు పదును పెడుతున్న విపక్షాలు.. ఈ క్రమంలో ఫైనల్ గా ఏం జరిగినా తమకు మంచిదేనన్న భావనలో ఉన్నట్లు తెలుస్తోంది.