AP PRC REPORT : ఉద్యోగులకు షాక్- 14.29 శాతమే ఫిట్ మెంట్-రిపోర్ట్ లో కష్టాల ఏకరువు
ఏపీలో ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో కోరుతున్న పీఆర్సీ నివేదిక వెల్లడైంది. ఇవాళ సాయంత్రం సీఎం జగన్ ను కలిసిన అధికారుల కమిటీ ఈ నివేదికను ఆయనకు సమర్పించింది. ఆ తర్వాత దీన్ని ఆన్ లైన్ లో ఉంచారు. అలాగే మీడియాకు కూడా విడుదల చేసారు. దీని ప్రకారం ఉద్యోగులకు 11వ పీఆర్సీలో 14.29 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని అధికారుల కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనిపై ఉద్యోగ సంఘాలు భగ్గుమంటుున్నాయి.
11వ పీఆర్సీ నివేదిక విడుదల
ఏపీలో ఉద్యోగులు కొంతకాలంగా పోరాటం చేస్తున్న పీఆర్సీ నివేదికను ప్రభుత్వం ఇవాళ బహిర్గతం చేసింది. సీఎం జగన్ వారం రోజుల క్రితం ఇచ్చిన హామీ ప్రకారం పీఆర్సీ నివేదికను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. సాయంత్రం సీఎం జగన్ ను కలిసిన అధికారుల కమిటీ ఈ నివేదికను ఆయనకు అందజేసింది. దీన్ని ఆ తర్వాత ఆన్ లైన్టో పెట్టడంతో పాటు మీడియాకు కూడా విడుదల చేశారు. ఇందులో పలు కీలకమైన అంశాలున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ ఆర్ధిక కష్టాల్ని కూడా ఏకరువు పెట్టారు.
14.29 శాతమే ఫిట్ మెంట్
ఏపీలో ఇవాళ సీఎంకు అధికారులు సమర్పించిన పీఆర్సీ రిపోర్ట్ ప్రకారం ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్ మెంట్ నే అధికారుల కమిటీ ప్రతిపాదించింది. 11వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఉద్యోగులు తమకు భారీగా ఫిట్ మెంట్ లభిస్తుందని పోరాటాలు చేస్తున్న క్రమంలో ప్రభుత్వం మాత్రం 14.29 శాతం ఫిట్ మెంట్ ప్రకటించడంతో ఉద్యోగులకు నిరాశ తప్పడం లేదు. ఉద్యోగులు 46 శాతం వరకూ ఫిట్ మెంట్ కోరుతుండగా.. నిన్న మొన్నటి వరకూ 36 శాతమని లీకులు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా 14.29 శాతానికి దీన్ని పరిమితం చేయడం చర్చనీయాంశమవుతోంది
రిపోర్టులో రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై పలు అంశాలను ఈ నివేదికలో సీఎస్ కమిటీ ప్రస్తావించింది. దీని ప్రకారం ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. ఉద్యోగుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను నివేదికలో ప్రస్తావిస్తున్నట్లు సీఎస్ కమిటీ తెలిపింది.
2018-19లో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ల రూపేణా చేసిన వ్యయం రూ. 52,513 కోట్లు కాగా, 2020-21 నాటికి ఆ వ్యయం రూ. 67,340 కోట్లకు చేరుకుందని తెలిపింది. 2018 -19లో రాష్ట్రప్రభుత్వం సొంత ఆదాయం (ఎస్ఓఆర్)లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల మొత్తం 84 శాతం అయితే, 2020-21 నాటికి అది 111 శాతానికి చేరుకుందని వెల్లడించింది. ప్రభుత్వ మొత్తం వ్యయంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం చేస్తున్న వ్యయం 2018-19లో 32 శాతం అయితే, 2020-21 నాటికి 36 శాతానికి పెరిగిందని తెలిపింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ వ్యయం ఏపీలోనే అధికమని నివేదిక తెలిపింది. 2020-21లో తెలంగాణాలో ఇది కేవలం 21 శాతమేనని, ఛత్తీస్గఢ్లో 32 శాతమని, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో 31 శాతమని,, ఒడిశా 29శాతమని, మధ్యప్రదేశ్ 28 శాతం, హరియాణ 23 శాతమని నివేదిక వెల్లడించింది.
నివేదికలో కీలక అంశాలు:
రాష్ట్ర విభజన అనేది రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై పెను ప్రభావం చూపిందని నివేదికలో తెలిపారు. తెలంగాణలో సగటు తలసరి ఆదాయం రూ.2,37,632 కాగా, ఏపీలో అది కేవలం రూ. 1,70,215 మాత్రమేననన్నారు. రూ. 6,284 కోట్ల విద్యుత్ బకాయిలు ఇంకా తెలంగాణ నుంచి రావాల్సి ఉందన్నారు. రెవిన్యూ లోటు కింద ఉన్న రూ. 18,969.26 కోట్లు ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందన్నారు. కోవిడ్ -19 కారణంగా ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని నివేదికలో అధికారులు తెలిపారు.కోవిడ్ కారణంగా రూ.20 వేల కోట్ల అదనపు భారం పడిందన్నారు. ఇంతటి కష్టాల్లో కూడా ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలకోసం అనేక నిర్ణయాలు తీసుకుందని వెల్లడించారు. జులై 1, 2019 నుంచి 27శాతం ఐఆర్ను ఇచ్చామని, ఐ.ఆర్. రూపేణా ఉద్యోగులకు రూ.11,270.21 కోట్లు, పెన్షనర్లకు రూ. 4,569.78 కోట్లు, మొత్తంగా రూ. 15.839.99 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. అంగన్వాడీ, ఆశావర్కర్లు సహా వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగులకు ప్రభుత్వం వేతనాలు పెంచినట్లు తెలిపారు. 3,01,021 ఉద్యోగులకు ఈ ప్రభుత్వం జీతాలు పెంచిందన్నారు. తద్వారా ఏడాదికి వీరికి జీతాల రూపంలో ప్రభుత్వం చేస్తున్న ఖర్చు రూ.1,198 కోట్ల నుంచి రూ.3,187 కోట్లుకు పెరిగిందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైం స్కేలు సహా ఇతర ప్రయోజనాలను ఈ ప్రభుత్వం అందించిందని నివేదిక తెలిపింది. ప్రభుత్వ డిపార్ట్మెంట్లు, యూనివర్శిటీలు, సొసైటీలు, కేజీవీబీ, మోడల్ స్కూళ్లు తదితర ఉద్యోగులకు వర్తింపు చేసిందన్నారు. ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ. 5 లక్షల రూపాయలు, సహజ మరణానికి రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా కూడా వీరికి అమలు చేస్తోందన్నారు. ఈ చర్యల వల్ల ప్రభుత్వంపై రూ. 360 కోట్ల మేర ఏడాదికి ప్రభుత్వంపై భారం పడుతోందని వెల్లడించారు.
Recommended Video
రాష్ట్ర ప్రభుత్వంపై భారమిదే
ఏపీఎస్ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల 2020 జనవరి నుంచి ఆ సంస్థ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులగా మారారని నివేదికలో తెలిపారు. జనవరి 2020 నుంచి అక్టోబరు 2021 వరకూ రూ.5,380 కోట్ల భారం ప్రభుత్వంపై పడిందన్నారు. పరిపాలనా సంస్కరణల్లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రభుత్వం తీసుకు వచ్చిందని, దీంతో 1.28 లక్షల మంది శాశ్వత ఉద్యోగులను తీసుకుందన్నారు. వీరి వల్ల ఏడాదికి రూ. 2,300 కోట్ల భారం ప్రభుత్వంపై పడిందన్నారు. ఆరోగ్య రంగంలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ తదితర సిబ్బందిని భారీగా నియమించినట్లు తెలిపారు. దీనివల్ల అదనంగా ఏడాదికి రూ.820 కోట్ల భారం ప్రభుత్వ ఖజానాపై పడిందన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రయోజనాల కోసం అప్కాస్ను ప్రారంభించినట్లు తెలిపారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే జీతాలను జమ చేస్తోందన్నారు. ఈపీఎఫ్ మరియు ఈఎస్ఐ వంటి సదుపాయాలను కల్పించిందని వెల్లడించారు. అప్కాస్ రూపంలో ఏడాదికి ప్రభుత్వంపై రూ. 2,040 కోట్ల భారం పడుతోందని నివేదికలో తెలిపారు. ఎంపీడీఓలకు ప్రమోషనల్ ఛానల్ అంశాన్ని ఈ ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. గ్రేడ్-1 వీఆర్వోలకు ప్రమోషన్ ఛానల్ను ఏర్పాటు చేసిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 3,795 వీఆర్వో, వీఆర్ఏ పోçస్టుల భర్తీకి ఆదేశాలు ఇచ్చిందన్నారు. మహిళా ఉద్యోగులకు ఏటా అదనంగా ఐదు రోజుల పాటు ప్రత్యేకంగా సెలవులు మంజూరు చేసిందని వెల్లడించారు. రీలొకేట్ అయిన ఉద్యోగులకు 30శాతం హెచ్ఆర్ఐ చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు.