వెలగపూడిలో సచివాలయం: నారాయణ, కేంద్రం తేల్చేసిందిగా: హోదాపై బొత్స
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయాన్ని భూమిపూజ చేసిన ఉద్దండరాయునిపాలెం సమీపంలోని వెలగపూడిలో నిర్మించాలని ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఆరు నెలల్లో కోర్ కేపిటల్ పరిధిలోని ఈ ప్రాంతంలో సచివాలయ నిర్మాణం పూర్తి కావాలని భావిస్తోంది.
మంత్రి నారాయణ బుధవారం మాట్లాడుతూ... తాత్కాలిక సచివాలయం వెలగపూడిలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు.
వెలగపూడిలో భూసార పరీక్షల నివేదికలు వచ్చాయని, సర్వే నంబర్ 205, 206, 207, 208, 214లో సచివాలయ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. 6లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండస్తుల్లో సచివాలయం నిర్మిస్తామన్నారు.
దీనికి సంబంధించి రూ.180 కోట్లతో రేపు టెండర్లు ఆహ్వానించనున్నట్లు చెప్పారు. ఉద్ధండరాయునిపాలెం, తాళ్లాయిపాలెం, వెంగాయపాలెంను సీడ్ క్యాపిటల్గా గుర్తించామని, ఆ గ్రామాల్లోనే శాశ్వత సచివాలయం, రాజ్ భవన్, అసెంబ్లీ నిర్మిస్తామన్నారు.
చంద్రబాబు మాత్రమే అభివృద్ధి చేస్తారు: ఆనం
ఏపీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రమే అభివృద్ధి చేయగలరని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ చేయలేని అభివృద్ధిని కూడా టీడీపీ చేస్తోందన్నారు. ఇప్పటికైనా రఘువీరా రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. తాము పదవుల కోసం పార్టీ మారడం లేదన్నారు. జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం కోసమే పసుపు జెండా కప్పుకుంటున్నట్లు చెప్పారు.
హోదా లేకుండా పరిశ్రమలు వస్తాయా: బొత్స
ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని, దీనిపై టిడిపి వైఖరి స్పష్టం చేయాలని వైసిపి నేత బొత్స సత్యనారాయణ బుధవారం మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా లేకుండా పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా పైన ఏం ప్రయత్నం చేస్తున్నారో చెప్పాలన్నారు.
కేంద్రంతో చంద్రబాబు లాలూచీ పడ్డారన్నారు. సింగపూర్ కంపెనీల పేరుతో దోపిడీ జరుగుతోందని విమర్శించారు. ప్రత్యేక హోదా పైన చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి సరిగా లేదన్నారు. ఏపీకి హోదా సాధ్యం కాదని కేంద్రమంత్రి ఇందర్ జిత్ సింగ్ తేల్చి చెప్పినా ఎందుకు ఊరుకుంటున్నారని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా పైన ఇంకా ప్రజలను మభ్య పెట్టవద్దన్నారు. సమైక్య ఏపీకి తాను సీఎంగా ఉన్నప్పుడు వెయ్యి కోట్ల విలువైన పరిశ్రమలు వచ్చాయని చంద్రబాబు చెబుతున్నారని, వాటిని బయటపెట్టాలన్నారు. చంద్రబాబుకు ప్రచార యావ తప్ప అభివృద్ధిపై దృష్టి లేద్నారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ పోరాడుతుందన్నారు.