ఏపీలో అప్పటిదాకా వర్షాలే.. వాతావరణశాఖ తీవ్ర హెచ్చరిక!!
వర్షాకాలం కావడంతో రుతుపవనాల ప్రభావం అలాగే అరేబియా సముద్రంలో తుఫాను ప్రభావం కారణంగా దేశవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. దేశంలో అనేక రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలమవుతోంది. ఇక వయనాడ్ లో వరద మరణ మృదంగం మోగిస్తుంది. గత నెల రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న క్రమంలో మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, అస్సాం వంటి రాష్ట్రాలలో దారుణ పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
నేటి నుండి ఐదు రోజులు వానలే
వర్షాలు, వరదల కారణంగా నదులలోకి భారీగా వరద చేరుకుంది. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వర్షాలు, వరదలు కొనసాగుతున్నాయి. నేటి నుంచి ఐదు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు కృష్ణా, గోదావరి వరదల నేపధ్యంలో తీర ప్రాంతాల ప్రజలు, కృష్ణా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

ఏపీలో ఈ జిల్లాలలోనే వర్షాలు
శ్రీకాకుళం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
నిలకడగా గోదావరి
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులుగా ఉంది. నిలకడగా గోదావరి ప్రవహిస్తోంది. కూనవరం వద్ద 18.9 మీటర్లకు గోదావరి నీటిమట్టం చేరింది. ఇక పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం 12.4 మీటర్లుగా ఉంది.
వరదలతో అలెర్ట్
ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 10.60 లక్షల క్యూసెక్కులుగా ఉంది.దీంతో పూర్తిగా వరద తగ్గేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతేకాదు వర్షాలు పడే జిల్లాలలో రైతులు పొలం పనులకు వెళ్ళే వ్యవసాయ కూలీలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. పిడుగులు పడే అవకాశం ఉన్న కారణంగా చెట్ల క్రిందకు వెళ్ళకుండా ఉండాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications