ఏపీ రాజ్ భవన్ పేరు మార్పు..! నోటిఫికేషన్ విడుదల..!
దేశవ్యాప్తంగా రాజ్ భవన్ ల పేర్లు మారుస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వరుసగా రాష్ట్రాలు అమల్లోకి తెస్తున్నాయి. వివిధ తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే గవర్నర్లు కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం రాజ్ భవన్ ల పేర్ల మార్పుకు ఆమోద ముద్ర వేస్తున్నారు. దీంతో రాజ్ భవన్ ల పేర్లు కాస్తా లోక్ భవన్ గా మారుతున్నాయి. ఇదే క్రమంలో ఏపీలోనూ విజయవాడలో ఉన్న రాజ్ భవన్ పేరు లోక్ భవన్ గా మారబోతోంది.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుండి అందిన సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ 'రాజ్ భవన్, ఆంధ్రప్రదేశ్' పేరును 'లోక్ భవన్, ఆంధ్రప్రదేశ్' గా మార్చడానికి ఆమోదం తెలిపారు. ఈ మేరకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ జి.అనంత రాము బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి రాబోతున్నాయి. ఇకపై విజయవాడలో రాజ్ భవన్ కాస్తా లోక్ భవన్ గా దర్శనమివ్వబోతోంది.

2014లో రాష్ట్ర విభజన తర్వాత అమరావతి రాజధానిగా ఖరారు కావడంతో విజయవాడలో అప్పటి చంద్రబాబు సర్కార్ రాజ్ భవన్ ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇది విజయవాడలోనే కొనసాగుతోంది. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం అమరావతిలో రాజ్ భవన్ నిర్మాణం కోసం స్థలం కేటాయించింది. అక్కడ నిర్మాణం పూర్తయ్యే వరకూ ఈ లోక్ భవన్ విజయవాడలోనే ఉండబోతోంది. నిర్మాణం పూర్తయ్యాక లాంఛనంగా అమరావతిలో లోక్ భవన్ ప్రారంభిస్తారు.












Click it and Unblock the Notifications