ఏపీలో ఆగస్టు 3 నుంచి స్కూళ్లు ప్రారంభం- సీఎం జగన్ నిర్ణయం
ఏపీలో కరోనా వైరస్ కారణంగా మూతపడిన పాఠశాలలను ఆగస్టు 3 నుంచి తిరిగి ప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇవాళ క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో జరిగిన సమీక్షలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 9 రకాల సదుపాయాలను స్కూళ్లలో కల్పించాలని సూచించారు. పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తున్న సందర్భంగా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు.
గతేడాది ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నాడు-నేడు పథకం కింద 15 వేల 75 స్కూళ్లలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వీటిని జూలై కల్లా పూర్తి చేయాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు. వీటి బాద్యతను జిల్లా కలెక్టర్లు తీసుకుని రోజూ సమీక్షలు నిర్వహించాలని సూచించారు. ఇందుకోసం రూ.456 కోట్ల రివాల్వింగ్ ఫండ్ ను విడుదల చేసినట్లు జగన్ తెలిపారు. వీటి కోసం సిమెంట్, ఇసుక సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.
ఏపీలో మార్చి 22 నుంచి మూతపడిన స్కూళ్లను వాస్తవానికి జూన్ 12న తెరవాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ కొనసాగుతుండటం, వైరస్ వ్యాప్తి భయాలతో ఆగస్టుకు వాయిదా వేశారు. దీంతో విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కాబోతోంది. కాబట్టి సెలవులను సాధ్యమైనంత తక్కువగా ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు అందాయి.