ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయాలు- గ్రామాల్లో కోడ్ ఎత్తివేత- మేయర్ ఎన్నికలకు ఏర్పాట్లు
ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోరు ముగియడంతో తర్వాతి ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టిసారించింది. పంచాయతీ ఎన్నికలు ముగిసిన గ్రామాల్లో ఎన్నికల కోడ్ను తొలగించింది. అలాగే కార్పోరేషన్లలో మేయర్, డిప్యూటీ ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ మేరకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ గత నెలలోనే ముగిసింది. అయితే కొన్ని చోట్ల ఎన్నికలు పెండింగ్లో ఉండటం, పలు వివాదాలు తలెత్తిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ను మాత్రం ఎస్ఈసీ తొలగించలేదు. ఎట్టకేలకు ఇవాళ పంచాయతీ ఎన్నికలు ముగిసిన గ్రామాల్లో ఎన్నికల కోడ్ ఎత్తేస్తే ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇంకా ఎన్నికలు జరగాల్సిన 372 పంచాయతీల్లో మాత్రం ఎన్నికల కోడ్ కొనసాగుతుందని ఎస్ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడంతో ఈ పంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు.
మరోవైపు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో తదుపరి ప్రక్రియపై ఎన్నికల సంఘం దృష్టిపెట్టింది. ఓవైపు ఈ నెల 14న జరగాల్సిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కోసం ఏర్పాట్లు చేస్తున్న ఎస్ఈసీ.. మరోవైపు కార్పోరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్లను, జాయింట్ కలెక్టర్లను ఆయా కార్పోరేషన్ల పాలకమండళ్లలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకునేందుకు ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా నియమించారు. ఓ జిల్లాలో ఒకే కార్పోరేషన్ ఉంటే అక్కడ జిల్లా కలెక్టర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా ఉంటారు. కృష్ణా, చిత్తూరు వంటి రెండు కార్పోరేషన్లు కలిగిన జిల్లాల్లో అయితే ఒక దానికి కలెక్టర్, మరో దానికి జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరిస్తారని ఎస్ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.