జగన్ సర్కారుకు మళ్లీ నిమ్మగడ్డ ఝలక్- అసెంబ్లీ తీర్మానంపై గవర్నర్కు ఫిర్యాదు
ఏపీలో స్ధానిక ఎన్నికల నిర్వహణకు అనువైన పరిస్ధితులు లేవని, ఎన్నికల తేదీలపై నిర్ణయం తీసుకునే అధికారం అసెంబ్లీకే ఉండేలా చట్లంలో మార్పులు చేయాలని కోరుతూ నిన్న జగన్ సర్కారు అసెంబ్లీలో తీర్మానం చేసింది. రాష్ట్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ తీర్మానంతో దానికి చెక్ పెట్టాలని వైసీపీ సర్కారు భావించింది. కనీసం ప్రజల్లో దీనిపై చర్చ జరిగేందుకు తీర్మానం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావించింది.
ఏపీలో స్ధానిక సంస్ధల నిర్వహణ విషయంలో ప్రభుత్వంతో సై అంటే సై అంటున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిన్న అసెంబ్లీ చేసిన తీర్మానంపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ హరిచందన్కు రాసిన లేఖలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కే కింద ఎన్నికల కమిషన్కు స్వయం ప్రతిపత్తి ఉందని తెలిపారు. ఐదేళ్ల కోసారి ఎన్నికలు నిర్వహించడం కమిషనర్ విధిలో భాగమని నిమ్మగడ్డ గవర్నర్కు రాసిన లేఖలో గుర్తుచేశారు.
కేంద్ర ఎన్నికల సంఘానికీ, రాష్ట్ర ఎన్నికల సంఘానికీ సమాన అధికారాలు ఉన్నాయని, ప్రభుత్వ సమ్మతితోనే ఎన్నికలు జరపాలన్న వాదన రాజ్యాంగ విరుద్ధంగా ఉందని నిమ్మగడ్డ రమేష్ గవర్నర్ హరిచందన్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని తిరస్కరించాలని గవర్నర్ను నిమ్మగడ్డ కోరారు. అవసరమైతే ఈ విషయంలో సుప్రీంకోర్టుతో పాటు న్యాయనిపుణులను సైతం సంప్రదించాలని గవర్నర్ను ఆయన కోరారు. దీంతో ప్రభుత్వం స్ధానిక సంస్దల ఎన్నికల నిర్వహణపై చట్టంలో మార్పులు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురానుందా అన్న చర్చ జరుగుతోంది.