ఏపీలో వేగంగా లాక్ డౌన్ సడలింపులు- సచివాలయ కార్యకలాపాలు ప్రారంభం...
ఏపీలో కరోనా లాక్ డౌన్ ఎప్పుడు ముగిస్తుందా.. ఎప్పుడు ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభించాలా అని ఎదురుచూస్తున్న వైసీపీ సర్కారు.. నిన్న తాజాగా కేంద్ర హోంశాఖ ఇచ్చిన మార్గదర్శకాలతో ఊపిరి పీల్చుకుంది. వీటి ఆధారంగా ప్రభుత్వ కార్యకలాపాలను వీలైనంత మేర పెంచేందుకు వీలుగా ఆదేశాలు ఇచ్చింది. ఇందులో ప్రధానంగా సచివాలయ కార్యకలాపాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ విధానాల రూపకల్పనకు కీలకమైన సచివాలయాన్ని ఎక్కువ రోజులు మూసి ఉంచడం సాధ్యం కాదని గ్రహించిన ప్రభుత్వం.. తాజా మార్గదర్శకాల ఆధారంగా ఉద్యోగులు విధుల్లోకి వచ్చేందుకు వీలుగా ఆదేశాలు ఇచ్చింది.
Recommended Video
వెలగపూడి సచివాలయంలో అసిస్టెంట్ సెక్రటరీ పైన స్ధాయి అధికారులంతా తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మిగిలిన వారిలో కనీసం 33 శాతం ఉద్యోగులు హాజరవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మాత్రం మినహాయింపు ఇచ్చింది. అలాగే 65 ఏళ్లు దాటిన వారికి, గర్భవతులకు మినహాయింపు ఇచ్చారు. మరోవైపు కరోనా నియంత్రణకు సామాజిక దూరంతో పాటు ఇతర ముందుజాగ్రత్త చర్యలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. ఎవరికైనా ఫ్లూ లక్షణాలు ఉంటే వారిని కార్యాలయం లోపలికి అనుమతించరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.