తిరుపతికి మునికోటి మృతదేహం: రాజకీయ నేతల స్వార్థమే బలితీసుకుంది
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా కోసం ప్రాణాలర్పించిన మునికోటి మృతదేహం తిరుపతికి చేరుకుంది. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, చిరంజీవి, సి.రామచంద్రయ్య పలువురు కాంగ్రెస్ నేతలు చెన్నై నుంచి అతని మృతదేహాన్ని తీసుకొచ్చారు.
మునికోటి మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీటి పర్వంతమయ్యారు. మరోవైపు మునికోటి మృతదేహాన్ని చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చారు. తిరుపతిలో తిరుపతిలోని హరిశ్చంద్ర శ్మశాన వాటికోల మునికోటి అంత్యక్రియలు ముగిశాయి.
మునికోటి అంత్యక్రియల్లో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, చిరంజీవి, సి.రామచంద్రయ్య పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనున్నారు. మునికోటి మృతదేహం తిరుపతికి చేరుకున్న నేపథ్యంలో తిరుపతి ప్రజలు మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ నాయకుల స్వార్థమే మునికోటిని బలి తీసుకుందని అభిప్రాయపడ్డారు. ప్రత్యేకహోదా వస్తే ప్రజలకు, రాష్ట్రానికి ఏ రకమైన లబ్ది చేకూరుతుందో తెలిసినా పదవుల కోసం నేతలు ప్రత్యేకహోదాని పట్టించుకోవడం మానేశారని పేర్కొన్నారు.
రాజకీయ నాయకులు ఆడుతున్న ఆటలో పావులు కావొద్దని యువకులకు పలువురు హితవు పలికారు. హోదా రాకపోతే కష్టపడి సాధించుకోవచ్చు కానీ ప్రాణాలు పోతే తిరిగిరావని వారు తెలిపారు. మునికోటి మృతికి సంతాపంగా కాంగ్రెస్ పార్టీ తిరుపతి బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మునికోటి మృతిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ సంతాపం వ్యక్తం చేశారు.
మునికోటి ఆత్మహత్యపై హెచ్చార్సీలో ఫిర్యాదు:
ఏపీకి ప్రత్యేకహోదా కోసం ప్రాణత్యాగం చేసుకున్న కాంగ్రెస్ కార్యకర్త మునికోటి ఆత్మహత్యపై హెచ్చార్సీలో ఫిర్యాదు చేసారు. మునికోటి ఆత్మహత్యకు ఏపీ టీడీపీ, బీజేపీలే కారణమని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ స్టూడెంట్ జేఏసీ విద్యార్థి హెచ్చార్సీకి ఫిర్యాదు చేసింది.
మునికోటి మృతి పట్ల సచివాలయ ఉద్యోగుల సంతాపం
ఏపీకి ప్రత్యేకహోదా డిమాండ్ చేస్తూ ప్రాణ త్యాగం చేసిన మునికోటికి ఏపీ సచివాలయ ఉద్యోగులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడు మురళీ కృష్ణ మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. అందరం కలిసి పోరాడి ప్రత్యేక హోదాను సాధించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని, దానిని ఉద్యమాల ద్వారా పోరాడి సాధించుకుందామని చెప్పారు.