స్థానిక ఎన్నికల విషయంలో ఆ పని చెయ్యండి .. టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈసీకి లేఖ
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీలో రగడ కొనసాగుతుంది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించి తీరాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నాలు సాగిస్తుంటే నిమ్మగడ్డ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా ఉండగా ఎన్నికల నిర్వహణ జరగకూడదు అని ప్రభుత్వం ఎన్నికలకు నో అంటుంది . ఇక ఎలాగైనా ఎన్నికల నిర్వహణ జరిపించి తీరాలని రాష్ట్ర ఎన్నికల కమీషన్ పట్టుదలతో ఉన్న వేళ టిడిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు.
ఏపీ పంచాయితీ ఎన్నికల నిర్ణయాధికారంపై ఎస్ఈసీ వర్సెస్ సీఎస్..గవర్నర్ కోర్టులో బంతి
ఎన్నికలలో టిడిపి అభ్యర్థులను బెదిరించే ప్రయత్నం
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక టిడిపి అభ్యర్థులను బెదిరించే ప్రక్రియలకు దిగుతున్నారని లేఖలో పేర్కొన్న అచ్చెన్నాయుడు ఆన్లైన్లో నామినేషన్ ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. సంతమాగులూరు మండలం కుందూరులో వైసీపీ శ్రేణులు కత్తులతో టిడిపి అభ్యర్థుల పై దాడులకు పాల్పడ్డారని, కుందూరు ఎంపిటిసి అభ్యర్థి రాఘవమ్మ భర్తపై హత్యాయత్నం చేశారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో టీడీపీ అభ్యర్థులపై దాడులు , బెదిరింపులు .. వైసీపీ నేతల వీరంగాలపై లేఖ
టిడిపి అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతూ, భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని, కిడ్నాప్స్ చేస్తూ వీరంగం సృష్టిస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని లేఖ ద్వారా ఎన్నికల సంఘానికి తెలియజేశారు టిడిపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ప్రతిపక్ష నాయకులపై, కార్యకర్తలపై ఇష్టారాజ్యంగా దాడులు చేస్తున్నారని ఇంతా జరుగుతున్నా ఏపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉందని తెలిపారు.
స్థానిక ఎన్నికల్లో వైసీపీ నేతల విధ్వంసంపై సీబీఐ విచారణ కోరిన అచ్చెన్న
గతంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలు సృష్టించిన విధ్వంసకాండ పై సీబీఐ విచారణ జరగాలని అచ్చెన్నాయుడు కోరారు. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన ప్రాంతాలలో ఎన్నికలు వాయిదా వేయాలని కోరిన ఆయన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు కేంద్ర భద్రతా దళాలతో రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. కేంద్ర భద్రతా దళాల పర్యవేక్షణలో వారి సహకారంతో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు, శ్రేణులు అనైతిక విధానాలకు పాల్పడుతున్నారన్నారు.
ఆన్ లైన్ లో నామినేషన్లు , కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలకు విజ్ఞప్తి
వైసీపీ నాయకులు అధికారం తమ పార్టీ చేతిలో ఉందని అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని అచ్చెన్నాయుడు తన లేఖలో పేర్కొన్నారు. హత్య రాజకీయాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అందుకే కేంద్ర భద్రతా దళాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఆన్లైన్లో నామినేషన్లు దాఖలు చేయడానికి అవకాశం కల్పించాలన్నారు. వైసీపీ నేతలు అనుసరిస్తున్న విధానాలతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, దీనిపై ఎన్నికల కమీషన్ దృష్టిసారించాలని అచ్చెన్నాయుడు లేఖలో పేర్కొన్నారు.