ఏపీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం- గోదావరి, కృష్ణా-గుంటూరు సీట్లకు
ఏపీలో ఖాళీగా ఉన్న రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. తూర్పు-పశ్చిమగోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ సీట్లకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు సీట్లకు జరుగుతున్న ఎన్నికల కోసం ఎన్నికల సంఘం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. పార్టీల ప్రభావం లేకుండా జరిగే ఈ ఎన్నికల్లో టీచర్లు మాత్రమే ఓటు వేయనున్నారు.
ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు జరుగుతున్న ఎన్నికల్లో మొత్తం 30 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఇందులో కృష్ణా-గుంటూరు నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్ధానానికి 19 మంది అభ్యర్ధులు రంగంలో ఉన్నారు. అలాగే ఉభయగోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్ధానానికి 11 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. కృష్ణా జిల్లాలో 51 పోలింగ్ కేంద్రాలు, గుంటూరు జిల్లాలో 60 పోలింగ్ కేంద్రాలు, తూర్పుగోదావరి జిల్లాలో 67 పోలింగ్ కేంద్రాలు, పశ్చిమగోదావరి జిల్లాలో 49 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఉభయగోదావరి జిల్లాలకు జరుగుతున్న టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పలుచోట్ల మావోయిస్టుల ప్రభావం ఉంది. దీంతో అక్కడ పోలింగ్ను మధ్యాహ్నం రెండు గంటల వరకే పరిమితం చేశారు. మిగతా చోట్ల సాయంత్రం 4 గంటల వరకూ సాగనుంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్ధానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపును ఈ నెల 17న చేపట్టనున్నారు. పూర్తిగా ఉపాధ్యాయ ఓటర్లు ఓటేస్తున్న ఈ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ఈసారి పార్టీలు అంతగా ఆసక్తి చూపకపోవడం విశేషం.