కృష్ణాబోర్డు లేఖతో కేంద్రం కోర్టులో ఏపీ, తెలంగాణా జల జగడం ... నీటి వినియోగంపై ఎవరి వాదన వారిదే !!
ఏపీ,తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నది జలాల వినియోగంపై పంచాయితీ కొనసాగుతున్న వేళ కేంద్రానికి కృష్ణా నది యాజమాన్య బోర్డు లేఖ రాసింది. కృష్ణా నదీ జలాల్లో గత ఏడాది నీటి వాటాలో వినియోగించుకోకుండా మిగిలిన నీటిని తర్వాత సంవత్సరం ఉపయోగించుకోవచ్చా? లేదా? అన్న అంశంపై కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి కృష్ణానది యాజమాన్య బోర్డు లేఖ రాసింది. నీటి వినియోగంలో ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలోనే లేఖ రాసినట్లుగా తెలుస్తుంది.
Recommended Video

కేంద్ర జలసంఘానికి లేఖ రాసిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు
కేంద్ర జల సంఘానికి కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి హరి కేష్ మీనా లేఖ రాసి ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వినియోగంపై ఏకాభిప్రాయం కుదరడం లేదని,ఇరు రాష్ట్రాల మధ్య వివాదాన్ని కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ దృష్టికి తీసుకు వచ్చామని, కమిటీ భేటీలోనూ రెండు రాష్ట్రాలు ఎవరి వాదన వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు . నీటి వినియోగం విషయంలో విధి విధానాలు ఖరారు చేసే బాధ్యతను కేంద్ర జల సంఘానికి అప్పగించి, వీలైనంత త్వరగా పరిష్కరించాలని లేఖలో పేర్కొన్నారు.

గతేడాది వినియోగించుకోని నీటిపై తెలుగురాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగానికి సంబంధించిన తాజా వివాదం విషయానికి వస్తే గతేడాది వినియోగించుకోని నీటి వాటాను ఈ ఏడాది విడుదల చేయాలని కృష్ణా బోర్డు కు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. అయితే ఏ ఏడాది లెక్క ఆ ఏడాదే ఉంటుందని ,అలా వినియోగించుకోని నీటిని క్యారీ ఓవర్ గానే పరిగణించాల్సి ఉంటుంది అని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది.నీటి లెక్కలు ఏ ఏడాదికి ఆ ఏడాదే ముగుస్తాయని తేల్చి చెబుతోంది.

2019- 20 నీటి సంవత్సర లెక్కల్లో తెలుగురాష్ట్రాల మధ్య కుదరని ఏకాభిప్రాయం
తెలంగాణ ప్రతిపాదనకు ఏపీ ప్రభుత్వం నో చెబుతోంది. అయితే కృష్ణానది యాజమాన్య బోర్డు దీనికి సంబంధించిన విధానపరమైన నిర్ణయం తీసుకోవటం కేంద్ర జలసంఘమే చెయ్యాలని కోరుతోంది. కేంద్ర జల శక్తి శాఖకు రాసిన లేఖ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసి వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తుంది.
2019- 20 నీటి సంవత్సరానికిగానూ ఏపీ 651.99 టీఎంసీలకు ,647.43 టిఎంసిలు వినియోగించుకుంది. తెలంగాణ 333.52 టీఎంసీల నీటి వాటాకు 278.33 టిఎంసిల నీటిని వినియోగించుకుంది.

కేంద్రం కోర్టులో తెలుగురాష్ట్రాల జలజగడం .. తేల్చాల్సింది కేంద్రమే !!
గత నీటి సంవత్సరంలో తెలంగాణ వాటాలో 50 టీఎంసీల నీటిని వినియోగించుకోలేదని ఆ నీటిని 2020- 2021లో వినియోగించుకునేలా క్యారీ ఫార్వర్డ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణాయాజమాన్య బోర్డుకు ప్రతిపాదనలు పంపింది. అయితే అలా సాధ్యం కాదని ఏ ఏడాది నీటి లెక్కలు ఆ ఏడాదే ముగుస్తాయని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఇక ఈ విషయంలో కేంద్ర జల సంఘం జోక్యం చేసుకుని ఏపీ,తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వినియోగం వ్యవహారంలో సరైన నిర్ణయం తీసుకోవాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు కేంద్రం కోర్టులో తెలుగు రాష్ట్రాల జల జగడాన్ని పెట్టింది. ఈ విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications