అమరావతికి బిగ్ న్యూస్- 11 వేల కోట్లిచ్చేందుకు హడ్కో ఒప్పందం..!
ఏపీ రాజధాని అమరావతికి ఇవాళ గుడ్ న్యూస్ అందింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి పనుల ప్రారంభానికి చేస్తున్న ప్రయత్నాలకు ఊతమిచ్చేలా ఇవాళ ఓ కీలక ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా హడ్కో నుంచి 11 వేల కోట్ల రుణం అమరావతి రాజధానికి లభించబోతోంది. ఈ మేరకు ఏపీ రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ సీఆర్డీఏ హడ్కోతో ఇవాళ కీలక ఒప్పందం చేసుకుంది. దీంతో త్వరలో ఈ నిధులు విడుదల కానున్నాయి.
అమరావతి రాజధాని నిర్మాణం కోసం నిధులు సేకరిస్తున్న ఏపీ ప్రభుత్వం..హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో)కు పంపిన ప్రతిపాదనల్ని తాజాగా జనవరిలో ఆమోదించారు. ఈ మేరకు జనవరి 22 న ముంబై లో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధులు మంజూరుకు అంగీకారం తెలిపారు. ఈ మేరకు ఇవాళ హడ్కో, సీఆర్డీయే ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో హడ్కో -సీఆర్డీయే మధ్య ఒప్పందం కుదిరింది.

ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, హడ్కో సిఎండీ సంజయ్ కుల్ శ్రేష్ఠ, మునిసిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ ఒప్పందం మేరకు రాజధాని నిర్మాణాలకు హడ్కో రూ.11 వేల కోట్లు రుణంగా అందించనుంది. దీంతో రాజధాని ప్రాజెక్టులకు నిధుల కొరత తీరబోతోంది. హడ్కో రుణాన్ని ప్రభుత్వం భవిష్యత్తులో వాయిదాల రూపంలో తీర్చాల్సి ఉంటుంది.

ఇప్పటికే ఆసియా అభివృద్ధి బ్యాంకు, ప్రపంచ బ్యాంక్ కలిపి రూ.15 వేల కోట్ల మేర రుణాలిచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు హడ్కో నిధుల రాకతో అమరావతి పనులు వేగం పుంజుకోనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. ఇప్పటికే రాజధానిలో గతంలో భూములు కేటాయించిన సంస్ధలకు వాటిని తిరిగి కేటాయించడం, లేదా ముందుకు రాని సంస్ధలకు భూముల్ని రద్దు చేయడం వంటి చర్యలు తీసుకున్నారు. త్వరలో టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసి అమరావతి పనులు ప్రారంభించబోతున్నారు.












Click it and Unblock the Notifications