విజయవాడ-బెంగళూరు ప్రయాణీకులకు ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్; అందులో చిన్న ట్విస్ట్ ఏంటంటే!!
ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి బెంగళూరుకు ప్రతినిత్యం ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణం చేస్తున్న క్రమంలో ఏపీఎస్ఆర్టీసీ ఏపీలోని ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడ బెంగళూరు మధ్య నడిచే వెన్నెల స్లీపర్, అమరావతి ఏసీ బస్సులలో ప్రయాణం చేసేవారికి టికెట్ చార్జీలలో రాయితీని ఇవ్వనున్నట్లుగా ప్రకటించింది.
విజయవాడ బెంగుళూరు నగరాల మధ్య ఆ బస్సుల్లో ప్రయాణాలపై రాయితీ
విజయవాడ బెంగుళూరు నగరాల మధ్య నడిచే వెన్నెల స్లీపర్, అమరావతి ఏసీ బస్సులలో 20 శాతం టికెట్ రాయితీ ఇవ్వనున్నట్టు గా ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. బంపర్ ఆఫర్ ను ప్రకటించిన ఏపీఎస్ఆర్టీసీ అందులో చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చింది. గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి మీదుగా నడిచే విజయవాడ బెంగళూరు బస్సులలో టికెట్ చార్జీలను 20 శాతం రాయితీ ప్రకటించిన ఏపీఎస్ఆర్టీసీ, ఈ బస్సులలో ఆయా స్టేషన్ లలో బస్సులు ఎక్కే ప్రయాణికులకు కూడా రాయితీని వర్తింప చేయనుంది.
వారంలో ఆ రెండు రోజులు నో రాయితీ
కానీ విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే సర్వీసులకు ఆదివారం రోజు, బెంగళూరు నుండి విజయవాడ వచ్చే సర్వీసులకు శుక్రవారం రోజు మాత్రం రాయితీ ఇవ్వడం లేదని వెల్లడించింది. ఎందుకంటే ఆ రెండు రోజుల్లో ప్రయాణాలు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ రద్దీ దృష్ట్యా ఆ రెండు రోజులు మాత్రం రాయితీ లేదని చెప్పింది. ఈ రెండు రోజులు సాధారణ చార్జీలను వసూలు చేస్తారని పేర్కొంది. వారంలో మిగిలిన అన్ని రోజుల్లోనూ విజయవాడ బెంగళూరు బస్సులకు 20 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు తెలిపింది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఎంవై దానం సూచించారు.
ఏపీఎస్ ఆర్టీసీ ఇచ్చే రాయితీ ఆ రెండు రోజులు ఇస్తే బాగుంటుందన్న ప్రయాణికులు
అయితే ముఖ్యంగా విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే సర్వీసులకు ఆదివారం రోజు, బెంగళూరు నుండి విజయవాడ వచ్చే సర్వీసులకు శుక్రవారం రోజు బాగా డిమాండ్ ఉంటుంది. ఎక్కువ మంది ఈ రోజు రోజులే ప్రయాణాలు చెయ్యటానికి ఆసక్తి చూపుతారు. వీకెండ్ హాలిడేస్ నేపధ్యంలో శుక్రవారం రాత్రి బెంగళూరు నుండి ప్రయాణాలు చేస్తారు. తిరిగి మళ్ళీ ఆదివారం నాడు సాయంత్రం తిరిగి ప్రయాణం అవుతారు. ఈ క్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ ఇచ్చే రాయితీ ఆ రెండు రోజులు ఇస్తే బాగుంటుందని పలువురు భావిస్తున్నారు.
ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించిన రాయితీ ప్రకారం టికెట్ల ధరలు ఇవే
ఇదిలా ఉంటే ఆర్టీసి ప్రకటించిన రైతు ప్రకారం విజయవాడ నుండి బెంగళూరుకు ప్రతిరోజు సాయంత్రం ఐదున్నర గంటలకు బయలుదేరి వెన్నెల స్లీపర్ సర్వీస్ బస్సులో సాధారణ టికెట్ ధర 1830 రూపాయలు కాగా, ప్రస్తుతం 20 శాతం రాయితీ ప్రకటించడంతో టికెట్ ధర రాయితీ పోను 1490 రూపాయలుగా మారింది.
అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు విజయవాడ నుండి బయలుదేరే అమరావతి సర్వీస్ లో సాధారణ టికెట్ ధర 1710 రూపాయలుగా ఉంది. ఇక ఈ టిక్కెట్లు ధరలు 20 శాతం రాయితీ పోను ప్రస్తుతం 1365 రూపాయలు టిక్కెట్టు ధరగా చెల్లించాల్సి ఉంటుంది. బెంగళూరు నుండి విజయవాడకు బయలుదేరిన బస్సులలో కూడా ఇవే ధరలు ఉంటాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.