వీడని కరోనా భయం- ముందుకు రాని జనం- ఏపీఎస్ ఆర్టీసీ సర్వీసుల వెలవెల...
ఏపీలో కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ లో ప్రభుత్వం ఈ మధ్య కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఇందులో ప్రజా రవాణా కూడా ఒకటి. రెండు నెలలుగా కరోనా వ్యాప్తి భయాలతో సర్వీసులు నడపని ఆర్టీసీ.. బస్సు సీటింగ్ సహా పలు మార్పులు చేసి తిరిగి బస్సులను ప్రారంభించింది. పరిమితంగా నడుపుతున్న ఈ సర్వీసులకు కూడా ప్రజల్లో స్పందన కరవవుతోంది. కరోనా వైరస్ భయాలతో పాటు ప్రభుత్వ ఆంక్షలు కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది.
Recommended Video
corona update : కరోనా కేసుల్లో టాప్ 10 లో భారత్ .. కొత్త కేసుల నమోదులో 4వ స్థానం
అమ్మో ఆర్టీసీ బస్సా....
లాక్డౌన్తో నగరాలు, పట్టణాల్లో వ్యాపారాలు జరగడం లేదు.విద్యా సంస్థలు మూతపడే ఉన్నాయి. పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు సైతం వాయిదా వేసుకుంటున్నారు.ఇక ఊరి నుంచి కదలడం ఎందుకని గ్రామీణులు భావిస్తున్నారు.అందుకే ఆర్టీసీ సర్వీసులు అందుబాటులోకి తెచ్చినప్పటికీ వాటిలో పల్లెవెలుగు బస్సులు ఖాళీగానే కనిపిస్తున్నాయి.
ఈ నెల 21 నుంచి బస్ సర్వీసులు పునరుద్ధరించారు.రాష్ట్రంలో నిత్యం సగటున 1400-1500 బస్ సర్వీసులు నడుపుతుండగా, వీటిలో సగం పల్లెవెలుగులే.మొత్తం సర్వీసుల్లో 17 శాతం ఆరంభించగా, రద్దీని బట్టి పెంచాలని భావించారు.అయితే గ్రామీణ ప్రాంతాలకు తిరిగే పల్లెవెలుగు సర్వీసుల్లో రద్దీ కాదు కదా, బస్సులో సీట్లు కూడా పూర్తిగా నిండటం లేదు.
కరోనా భయాలు- ప్రభుత్వ ఆంక్షలు...
పల్లె వెలుగు బస్సుల్లో 60 సీట్లుంటాయి. భౌతికదూరం పాటించేందుకు 36 సీట్లలోనే ప్రయాణికులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు.కానీ 10-15 సీట్లకు మించి నిండటం లేదని అధికారులు చెబుతున్నారు. ఇందుకు కరోనా భయాలతో అధికారులు పెడుతున్న ఆంక్షలు కూడా కారణమవుతున్నాయి. కరోనా భయాలతో అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు చేసేందుకు ముందుకు రావడం లేదు. వారిలో వేచి చూసే ధోరణే కనిపిస్తోంది. అలాగే బస్సుల్లో ప్రయాణాల కోసం టికెట్లు ఆన్ లైన్లో కొనుగోలు చేయాల్సి రావడం, బస్సులో కాకుండా బయట టికెట్ తీసుకుని బస్సు ఎక్కమనడం, మాస్కులు, భౌతిక దూరాలు ఇవన్నీ సాధారణ ప్రయాణికులకు ఇబ్బందిగా మారాయి. కానీ వీటికి మినహాయింపులు ఇచ్చే పరిస్ధితి లేదు.
పట్టణాల్లో లాక్ డౌన్ సమస్య....
పట్టణాలు, నగరాలకు వెళ్లినా పెద్దగా ప్రయోజనం లేకపోవడం, స్టాపులు కూడా తక్కువగా ఉండటంతో వీటిలో ప్రయాణించేందుకు పల్లె ప్రజలు ఆసక్తి చూపడం లేదు.గ్రామాల నుంచి విజయవాడ, విశాఖ, గుంటూరు, కర్నూలు, అనంతపురం వంటి నగరాలకు వచ్చినా అక్కడ సిటీ బస్సులు, ఆటోలు కూడా అందుబాటులో లేకపోవడం వల్ల ఎక్కువ మంది ఊరు దాటి రావడం లేదు.నిత్యం కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నందున అత్యవసరమైతే తప్ప చాలామంది బయటికి రావడం లేదని అధికారులు చెబుతున్నారు.
దూర ప్రాంతాలకు మాత్రం రద్దీ...
దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో మాత్రం ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటోంది.సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, కొన్ని ఎక్స్ప్రెస్ బస్సుల్లో సీట్లన్నీ నిండుతున్నాయి.విజయవాడ నుంచి రాయలసీమ జిల్లాలకు 20 సర్వీసులు నడుపుతున్నారు.సీమ నుంచి విజయవాడకు మరో 30 సర్వీసులు తిప్పుతున్నారు.
తొలుత జిల్లాల నుంచి విజయవాడకు ఒకటి, రెండు సర్వీసులే నడిపితే సరిపోతుందనుకున్నా డిమాండ్ ఎక్కువగా ఉండటంతో సంఖ్య పెంచారు.విజయవాడ - విశాఖ మధ్య తొలుత 10-15 సర్వీసులే నడిపారు.ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకునేవారు అధికంగా ఉండటంతో 80 వరకు పెంచారు.వేర్వేరు జిల్లాల మధ్య తిరిగే బస్సుల్లోనూ రద్దీ ఉంటోంది.విజయవాడ నుంచి విశాఖకు ఏసీ సర్వీసులు కూడా ఆదివారం నుంచి ఆరంభించారు.