సంక్షేమ పథకాల కోసం వైసీపీ నేతల జేబుల్లో డబ్బు ఖర్చు చేస్తున్నారా .. నిలదీయాలన్న బాలకృష్ణ
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ నేతలు దూకుడు చూపిస్తున్నారు. ఈ రోజు ప్రచారానికి చివరి రోజు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న కార్పొరేషన్ లు , మున్సిపాలిటీలలో పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తున్నారు . హిందూపురం మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బాలకృష్ణ సైతం మాటల తూటాలను పేలుస్తూ ఎన్నికల వేడి రాజేస్తున్నారు .తాజాగా హిందూపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాలయ్య ఇందిరమ్మ కాలనీ, చౌడేశ్వరి కాలనీ ,కొర్లగుంట తదితర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా హిందూపూర్ లోని తన ఇంట్లో కేక్ కట్ చేసిన బాలయ్య, స్థానిక మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే సందర్భంలో ప్రచారం నిర్వహిస్తున్న బాలకృష్ణ వైసిపి నేతలపై మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే సంక్షేమ పథకాలు కట్ చేస్తామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, ఎవరైనా బెదిరిస్తే నిలదీయమని బాలయ్య పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది ప్రజలు చెల్లించే పన్నులతోనే అని పేర్కొన్న బాలకృష్ణ , సంక్షేమ పథకాల అమలుకు వైసీపీ నేతలు జేబుల్లో డబ్బులు ఖర్చు చేయడం లేదని ఘాటుగా విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు ఏం చేశారో చెప్పాలని ప్రజలు , వైసిపి నేతలను నిలదీయాలని బాలయ్య పేర్కొన్నారు. ఈరోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు బాలకృష్ణ . మరి ఈసారి బాలయ్య రంగంలోకి దిగి సాగించిన ఎన్నికల ప్రచారంతో హిందూపురం మున్సిపాలిటీలో టీడీపీకి ప్రజలు పట్టం కడతారా లేదా అనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications