వెనక్కి తీసుకోండి: సెక్షన్8పై హైకోర్టు షాక్, రైల్రోకో.. మంత్రి పత్తిపాటికి అరెస్ట్ వారెంట్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్-8ను అమలు చేసేలా ఆదేశాలివ్వాలంటూ సీమాంధ్రకు చెందిన గెజిటెడ్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు సోమవారం నాడు తోసిపుచ్చింది. పిటిషన్ను భేషరతుగా వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది.
విలువైన కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్లో విచారణకు అర్హమైన అంశాలు లేవని న్యాయస్థానం పేర్కొంది. కేసు విచారణ జరపాలంటే నగదు డిపాజిట్ చేయాలని చెప్పింది. కాగా, పిటిషనర్ తన పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు.
మంత్రి పత్తిపాటి, ఎమ్మెల్యే ఆలపాటికి అరెస్టు వారెంట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నేతలైన మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే ఆలపాటికి గుంటూరు రైల్వే కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. రైలు రోకో కేసులో ప్రతీ వాయిదాకు కోర్టుకు గైర్హాజరవుతుండటంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు అరెస్టు వారెంట్ జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.