ఆంధ్రప్రదేశ్ కు తప్పిన ‘గజ’ తుఫాన్ ముప్పు...తమిళనాడు వైపుకు మళ్లింది!
నెల్లూరు:ఆంధ్రప్రదేశ్ కు 'గజ' తుఫాన్ ముప్పు తప్పిపోయింది. ఈ తుఫాన్ రాష్ట్రంపై ఎక్కడ విరుచుకు పడుతుందోనని తీవ్ర భయాందోళనలకు గురవ్వగా అది దిశ మార్చుకొని తమిళనాడువైపుకు వెళ్లడంతో ఇప్పుడు ఆ రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉన్న పరిస్థితి.
పశ్చిమ, తూర్పుమధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో నెలకొని ఉన్న 'గజ' తుఫాన్ సోమవారం మధ్యాహ్నానికి చెన్నైకి 720కి.మీ...నాగపట్నానికి 800కి.మీ తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. అయితే ఇది పయనిస్తున్న వేగాన్ని బట్టి ఈ నెల 15 వ తేదీ ఉదయానికి తమిళనాడులోని కడలూరు-పంబన్ మధ్య తీరం దాటవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. తదనుగుణంగా ముందు జాగ్రత్త చర్యలపై హెచ్చరికలు జారీ చేశారు.
తమిళనాడు...ఆ దిశలో
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా పరిణామం చెందగా దీనికి ‘గజ తుఫాన్గా ఐఎండి నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఇది తీవ్ర తుఫాన్ గా మారి తొలుత చెన్నై-నెల్లూర్ మధ్య తీరం దాటుతుందని అంచనా వేశారు. అయితే తదనంతరం తుఫాన్ దిశ మార్చుకోవడంతో ఈ నెల 15 నాటికి కడలూరు-పంబన్ వద్ద ఈ ‘గజ' తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేస్తోంది.
ఎపిపై...గజ తుఫాన్ ప్రభావం
ఈ 'గజ' తుఫాన్ ప్రభావంతో బుధవారం సాయంత్రం నుంచి దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. గజ తమిళనాడుకు మళ్లినా దాని ప్రభావంతో ఎపిలో నెల్లూరు,చిత్తూరుల్లో భారీ వర్షాలు, ప్రకాశంలో ఓ మోస్తరు కురిసే అవకాశాలు ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇప్పటికే విశాఖపట్టణం నుంచి కృష్ణపట్నం పోర్టులో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని మత్స్యకారులను హెచ్చరించారు.
గజపై...సిఎం చంద్రబాబు ఆరా
ఇదిలావుంటే ఇటీవలే రాష్ట్రం తిత్లీ తుఫాన్ తాకిడికి గురైన నేపథ్యంలో తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ ‘గజ' తుఫాన్ గురించి సీఎం చంద్రబాబు ఆరా తీశారు. తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సిఎం హెచ్చరించారు. ఏమరుపాటు లేకుండా గజ తుఫాన్ కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని సూచించారు.
ఆర్టీజిఎస్ ని...వాడుకోండి
మత్స్యకారులు వేటకు వెళ్లకుండా సూచనలివ్వాలని...అవసరమనుకున్న చోట ముందు జాగ్రత్త చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. అలాగే ఆర్టీజిఎస్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా పరిస్థితి తెలుసుకునే అవకాశం ఉందని, అధికారులు అత్యంత అధునాతనమైన ఈ వ్యవస్థని అధికారులు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.