జైట్లీ ఏదో చెప్పారుగా: వైసిపిపై సుమిత్ర ఫైర్, ఢిల్లీకి బాబు.. వ్యూహం సిద్ధం
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా అంశం పార్లమెంటులో గందరగోళానికి దారి తీస్తోంది. బుధవారం నాడు పార్లమెంటు సమావేశాలకు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు నల్ల బ్యాడ్జీతో వచ్చి నిరసన తెలిపారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రెండు సభల్లోను పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. లోకసభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టనీయకుండా కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులతో పోడియంలోకి దూసుకురాగా, స్పీకర్ సుమిత్రా మహాజన్ అభ్యంతరం తెలిపారు.
లోకసభలో వైసిపి ఎంపీలు తమ స్థానాల నుంచి నిలబడి, వెల్లోకి వచ్చి నిరసన తెలిపారు. కాంగ్రెస్, వైసిపి ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ అసహనం వ్యక్తం చేశారు. ఏపీకి చేసే సాయం పైన మంగళవారం నాడు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేశారని గుర్తు చేశారు.

'రోజూ ఏమిటిలా? మీరు దయచేసి ప్లకార్డులు చూపొద్దు. సభలో ప్లకార్డులపై నిషేధం ఉంది. నిన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఏదో చెప్పారుగా? కేంద్రం, ఏపీ ప్రభుత్వాలు మాట్లాడుకుంటున్నాయి. వారికి కాస్తయినా సమయం ఇవ్వకుండా ఈ గొడవేంటి? మాట్లాడుకొని వారు ఓ నిర్ణయానికి వస్తారు. ఆపై అనుమానాలు ఉంటే తీర్చుకోవచ్చు. నేను మిమల్ని కేవలం రిక్వెస్ట్ మాత్రమే చేయగలను. దయచేసి మీ సీట్లలోకి వెళ్లిపోండి. ప్లకార్డులు ప్రదర్శించవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు' అని స్పీకర్ వ్యాఖ్యానించారు.
సభాపతి సూచనలను పట్టించుకోని కాంగ్రెస్ ఎంపీలు ప్రత్యేక హోదా ఆంధ్రల హక్కు అని నినదిస్తూ పోడియంను వదలలేదు.
వెంకయ్య ఇంటి ముట్టడిని అడ్డుకున్న పోలీసులు
ప్రత్యేక హోదా కోరుతూ ఏపీలో నిరసనలు కొనసాగుతున్నాయి. బుధవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఇంటిని ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు.
ఢిల్లీకి చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యే అవకాశముంది. ప్రధానితో భేటీలో భాగంగా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించేందుకు చంద్రబాబు వ్యూహం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది.
త్వరలో జరగనున్న కృష్ణా పుష్కరాలకు హాజరుకావాలంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, పలువురు కేంద్ర మంత్రులకు ఆహ్వానం పలికేందుకే చంద్రబాబు ఈ పర్యటనకు వెళ్తున్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో హోదా అంశాన్ని ప్రధాని ముందు లేవనెత్తనున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications