హైదరాబాద్పై అసద్ ససేమీరా, సీమాంధ్ర భద్రతపై హామీ
న్యూఢిల్లీ: విభజన తర్వాత తెలంగాణలో, హైదరాబాదులో సీమాంధ్రుల భద్రత తమ బాధ్యత అని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ శనివారం అన్నారు. ఆయన విభజనకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రధాని మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అసద్ విలేకరులతో మాట్లాడారు.
విభజన తరువాత హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా చేయటానికి వీలులేదని ఆయన ప్రధానికి చెప్పానన్నారు. తమ పార్టీ ఈ ప్రతిపాదనను అంగీకరించదన్నారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసిన పక్షంలో కేంద్రంలో మతతత్వ పార్టీలు అధికారంలోకి వచ్చిన పక్షంలో ముస్లిమ్ మైనారిటీల రక్షణ సమస్యగా మారుతుందని వివరించానన్నారు.

సీమాంధ్ర ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పూ లేదని, వారి ఆస్తులు, ప్రయోజనాలను కాపాడతామన్నారు. హైదరాబాద్ అంశంపై తమ అభ్యంతరాలను ప్రధానికి వివరించామని, శాంతి భద్రతలు, రెవెన్యూ, మునిసిపల్ పాలనను కేంద్రం తన చేతుల్లోకి తీసుకోకూడదని ప్రధానిని కోరినట్లు చెప్పారు. అలా చేస్తే తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నారు. వారు ఈ నిర్ణయాలకు అంగీకరించరని ఆయన చెప్పారు. ప్రధాని తన అభ్యర్థనల పట్ల సానుకూలంగా స్పందించారని, విభజనపై జివోఎం నివేదిక సమర్పించిన తర్వాత తమ అభ్యంతరాల గురించి కేంద్ర కేబినెట్లో చర్చిస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్లు ఒవైసీ వెల్లడించారు.
కేంద్రపాలిత ప్రాంతం చేయాలనే అభిప్రాయంతో తాము విభేదిస్తున్నామన్నారు. హైదరాబాద్కూ, సీమాంధ్ర ప్రాంతానికీ మధ్య భౌగోళిక సామీప్యత లేనేలేదన్నారు. హర్యానా, పంజాబ్లకు చండీగఢ్తో భౌగోళిక సంబంధాలున్నాయని చెప్పారు. ఒక రాష్ట్రంలో ఉన్న ప్రాంతాన్ని మరో రాష్ట్రం వారు అడగడం చరిత్రలో ఎక్కడా చూడలేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో ఉన్న సీమాంధ్ర ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని, వారు తమ సోదరుల లాంటి వారని అన్నారు.












Click it and Unblock the Notifications