అసని తుఫాను ఎఫెక్ట్: 37రైళ్ళు రద్దు; నావికాదళం అలర్ట్; హెలికాప్టర్లు, నౌకలు రెస్క్యూకి రెడీ!!
ఏపీ తీరంలో అసని తుఫాను తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాలలో ఈ నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు వాతావరణశాఖ అధికారులు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్టుగా వెల్లడించింది ప్రభుత్వ యంత్రాంగం. ఇక అసని తుఫాను ప్రభావం విమాన సర్వీసులపై కూడా చూపుతున్నట్టు తెలుస్తుంది. వరుసగా మూడో రోజు కూడా విమాన సర్వీసులను రద్దు చేశారు.
అసని ఎఫెక్ట్.. 37 రైళ్ళను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
ఇదిలా ఉంటే అసని తుఫాన్ మోగిస్తున్న డేంజర్ బెల్స్ నేపథ్యంలో రైల్వే శాఖ కూడా అలర్ట్ అయింది. తక్షణ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. మొత్తం 37 రైళ్ళను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించి, కొన్ని రైళ్లు షెడ్యూల్లో మార్పులు చేర్పులు చేశారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేసిన రైళ్లలో విజయవాడ మచిలీపట్నం, మచిలీపట్నం విజయవాడ రైళ్ళు, నర్సాపూర్ విజయవాడ, విజయవాడ నర్సాపూర్, నర్సాపూర్ నిడదవోలు, భీమవరం జంక్షన్ నిడదవోలు, విజయవాడ నిడదవోలు, విజయవాడ భీమవరం జంక్షన్ రైళ్ళు ఉన్నాయి.
పలు రైళ్ళు రీ షెడ్యూల్
అంతేకాకుండా కాకినాడ పోర్టు విజయవాడ మార్గాల్లో వెళ్ళే సర్వీసులను కూడా రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరికొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేసిన దక్షిణ మధ్య రైల్వే నర్సాపూర్ నాగర్ సోల్ ఎక్స్ ప్రెస్ షెడ్యూల్ ను మార్చింది. నర్సాపూర్ నుండి బుధవారం 11.05 నిముషాలకు బయలుదేరాల్సిన నాగర్ సోల్ ఎక్స్ ప్రెస్ రైలు షెడ్యూల్ ను మార్చారు. గుంటూరు డోన్ రైలు రీషెడ్యూల్ చేశారు. గుంటూరు మరియు డోన్ మధ్య నడవాల్సిన రైలు బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరాల్సి ఉండగా మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.
దారి మళ్ళిస్తున్న రైళ్ళు ఇవే
అంతేకాదు బిలాస్ పూర్ తిరుపతి, కాకినాడ పోర్టు చెంగల్పట్టు రైళ్లను నిడదవోలు, ఏలూరు, విజయవాడ మీదుగా దారి మళ్లిస్తున్నారు గా పేర్కొన్నారు. అంతేకాదు గుంటూరు రేపల్లె, రేపల్లె గుంటూరు, రేపల్లె తెనాలి, కాకినాడ పోర్ట్ టు విశాఖపట్నం, విశాఖపట్నం కాకినాడ పోర్ట్, రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు.
నావికా దళం అలెర్ట్ ..యుద్ధ నౌకలను, హెలికాఫ్టర్లను రెడీ చేసిన నేవీ
అసని తుఫాను ప్రభావం తూర్పు నావికా దళ అధికారులు అలర్ట్ అయ్యారు. ఏపీ, ఒడిశా ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి తుఫాను గమనాన్ని పరిశీలిస్తున్న అధికారులు విపత్కర పరిస్థితుల్లో సహాయం అందించడం కోసం యుద్ధ నౌకలను, హెలికాఫ్టర్లను రెడీ చేస్తున్నారు. విశాఖలోని ఐ ఎన్ ఎస్, డేగ, చెన్నైలోని ఐ ఎన్ ఎస్ రాజాలి నుంచి ఏరియల్ సర్వే, రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడం కోసం రెడీ అయ్యారు. మొత్తం 19 వరద సహాయక బృందాలను, ఆరు డైవింగ్ టీమ్లను, జెమినీ బోట్లతో కూడిన 5 యుద్ధ నౌకలను సిద్ధం చేశారు. ఎలాంటి విపత్కర పరిస్థితులను అయినా ఎదుర్కోవడానికి నావికాదళం రెడీ అయింది.
అసని ఎఫెక్ట్ .. ఆ జిల్లాలలో రెడ్ అలెర్ట్
ఇదిలా ఉంటే అసని తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భయంకరమైన ఈదురుగాలులతో పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.