చట్టం అమలుకు తీర్మానం: మోడీకి బాబు థ్యాంక్స్, అమరావతికి రూ.1.25 లక్షల కోట్లు
హైదరాబాద్: విభజన చట్టం అమలుకు ఏపీ శాసన సభ బుధవారం తీర్మానం చేసింది. 18 అంశాలతో ముఖ్యమంత్రి తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేస్తామని చట్టంలో ఉందని చెప్పారు.
విభజన చట్టంలోని హామీలనన్నింటిని నెరవేర్చాలన్నారు. దక్షిణ భారత దేశంలో ఏపీనే వెనుకబడి ఉందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కోసం రూ.1950 కోట్లు ఖర్చు చేస్తే రూ.345 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.4వేలకు పైగా కేటాయించాలని కోరామని చెప్పారు.
నగర జనాభా, తెలంగాణతో పోలిక
విభజన చట్టంలోని హామీలను త్వరితగతిన అమలు నెరవేర్చాలన్నారు. విభజన వల్ల ఏపీకి ఆర్థిక వనరులలు తీరని అన్యాయం జరిగిందన్నారు. ఏపీలో జనాభా ఎక్కువ, ఆదాయం తక్కువ అన్నారు. తెలంగాణలో జనాభా తక్కువ, ఆదాయం ఎక్కువ అన్నారు.
దక్షిణాదిన ఏపీయే వెనుకబడి ఉంది
దక్షిణాదిన నగర జనాభా ఏపీలోనే తక్కువ అని చెప్పారు. పొరుగు రాష్ట్రాలకు మెట్రో నగరాలు ఉన్నాయని, ఏపీకి మాత్రం లేవన్నారు. విభజన సమయంలో పోరాడటం వల్లనే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటన చేశారన్నారు. నగర జనాభాను పెంచుకోవాల్సిన అవసరముందన్నారు.
ఏపీలో అర్బన్ జనాభా తక్కువ కావడంతో ఆదాయం తగ్గిందన్నారు. నాడు విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరుగుతుందని మొత్తుకున్నా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదన్నారు. ఉద్యోగుల విభజనను త్వరగా పూర్తి చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇంకా రూ.16వేల కోట్లకు పైగా విడుదల కావాల్సి ఉందన్నారు.
అమరావతి ఆర్థిక శక్తిగా
ఆర్థిక లోటును పూడ్చాలన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి.. కేవలం రాజధానిగానే కాకుండా ఆర్థిక శక్తిగా ఉండాలన్నారు. అమరావతిలో పరిశ్రమల ప్రోత్సాహానికి వంద శాతం ఎక్సైజ్ డ్యూటీ మినహాయించాలన్నారు. ఏపీలో సంస్థాగత మార్పులు రాకుంటే ఆదాయం పెంచుకోలేమన్నారు.
విభజనకు ముందు పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏపీ అన్ని విధాలా వెనుకబడిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారన్నారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వాలని చంద్రబాబు చెప్పారు.
ముంపు మండలాలు వదిలేశారు
స్థానిక అంశంపై రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయాలన్నారు. ఆర్థిక లోటును పూడ్చేందుకు ఏపీకి నిధులు ఇస్తామని చెప్పారన్నారు. రాజధాని నిర్మాణం, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుంటే రాష్ట్రానికి చాలా ఇబ్బందులు అన్నారు. ఏపీని ప్రత్యేక కేటగిరీ రాష్ట్రంగా ప్రకటించాలని కోరుతున్నామన్నారు.
పోలవరంకు నిధులు ఇస్తే 2018లోగా ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేస్తామని ప్రకటించారు. కానీ ముంపు మండలాలను వదిలేశారన్నారు. మోడీ ప్రధాని కాగానే ముంపు మండలాలపై ఆర్డినెన్స్ తీసుకు వచ్చారన్నారు.
ఏపీలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు తక్షణమే ప్రకటించాలని తాము కేంద్రాన్ని కోరుతున్నామని చెప్పారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. శాసన సభ సీట్లను 175 నుంచి 225కు పెంచాలని కోరారు. పొరుగు రాష్ట్రాలతో సమానంగా వచ్చే వరకు ఆదుకోవాలన్నారు.
ఇప్పటిదాకా చేసిన సాయానికి థ్యాంక్స్
ఇప్పటి వరకు రాష్ట్రానికి కేంద్రం చేసిన సాయం పట్ల చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ రాజధాని, అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ.1500 కోట్లు మంజూరు చేసిందన్నారు. వివిధ కార్యక్రమాలకు కేంద్రం మద్దతు కావాలని శాసన సభ తీర్మానం సందర్భంగా చంద్రబాబు కోరారు.
అమరావతి నిర్మాణానికి రూ.1.25 లక్షల కోట్లు
రానున్న ఇరవై ఏళ్లలో రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.125 లక్షల కోట్లు అవసరమవుతాయని ప్రాథమిక అంచనా అని చెప్పారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి కొన్ని శాఖల కేటాయింపులు మాత్రమే వచ్చాయని, మిగతా శాఖల కేటాయింపులు కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. ఏపీని ప్రత్యేక కేటగిరిగా పరిగణనించాలని తాము ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఏపీకి కేంద్రం సహకరిస్తుందని ఆశిస్తున్నానని చంద్రబాబు చెప్పారు.