విభజనకు వైఎస్సే బీజం: జగన్ పార్టీపై ఎదురుదాడి
ప్రజల్లోకి వెళ్లడానికి దారి లేక వైయస్ జగన్ సమైక్యం ముసుగులో వెళ్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. వైయస్సార్ కాంగ్రెసు విభజనను కోరుకునే పార్టీ అని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దుర్మార్గమైన ఆలోచన చేస్తోందని ఆయన అన్నారు. సభా సమయాన్ని వృధా చేయడానికి ప్రయత్నిస్తోందని తప్పుపట్టారు. ఒకే అంశంపై నిరసన తెలియజేయడానికి, వాకౌట్ చేయడానికి అవకాశం ఇవ్వడం సరి కాదని ఆయన అన్నారు. సభ్యులంతా చర్చలో పాల్గొనాలని ఆయన అన్నారు.
అక్రమ సంతానం: పయ్యావుల
రాష్ట్ర విభజనకు కారకుడు వైయస్ రాజశేఖర రెడ్డి అని తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ అన్నారు. రాష్ట్ర విభజన చేయాలని చిన్నారెడ్డి నాయకత్వంలో సోనియా వద్దకు ప్రతినిధుల బృందాన్ని పంపింది వైయస్ రాజశేఖర రెడ్డేనని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు సభ వెలుపల చెప్పాల్సింది లోపల, సభ లోపల చెప్పాల్సింది వెలుపల చెబుతున్నారని ఆయన అన్నారు. తమ మీద దుమ్మెత్తిపోసే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రయత్నాలను ఖండించకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన అన్నారు. కాంగ్రెసుతో తమ పార్టీ కుమ్మక్కయిందనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విమర్శలో నిజం లేదని ఆయన అన్నారు.
రాష్ట్రం వెంటనే విడిపోవాలని వైయస్ జగన్ కోరుకుంటున్నారని ఆయన అన్నారు. సభపై నమ్మకంతోనే తాము చర్చలో పాల్గొంటున్నామని ఆయన అన్నారు. తాము ఓటింగుకు వ్యతిరేకమన్నట్లు విజయమ్మ మాట్లాడుతున్నారని, ఓటింగును కోరి సాధించే హక్కు తమకు ఉందని, అంత దాకా వేచి చూడకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిందలు వేస్తోందని ఆయన అన్నారు. సభ నుంచి తప్పించుకోవడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అసంబద్దమైన విషయాలు చెబుతోందని ఆయన అన్నారు. ప్రజలను మోసం చేయడానికి వైయస్సార్ కాంగ్రెసు ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఉన్నది 17 మంది సభ్యులని, విజయమ్మ మాట్లాడుతూ పదే పదే 23 మంది సభ్యులని అంటున్నారని, ఆ అక్రమ సంతానం ఎక్కడిదని ఆయన అన్నారు.
మాతోనే వైయస్ కల సాకారం: కెటిఆర్
తమ పార్టీ పుట్టక ముందే రాష్ట్ర విభజనకు వైయస్ రాజశేఖర రెడ్డి బీజం వేశారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యుడు కెటి రామారావు అన్నారు. 2001లోనే వైయస్ విభజన కావాలంటూ సోనియాకు 41 మంది శాసనసభ్యులతో సోనియాకు వినతి పత్రం ఇప్పించారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న పార్టీ అని తెలిసి కూడా వైయస్ రాజశేఖర రెడ్డి తమ పార్టీతో పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రి కావాలనే కలను సాకారం చేసుకున్నారని ఆయన అన్నారు.
మొదటి ఎస్సార్సీని గౌరవిస్తామని ఒప్పందం చేసుకున్నారని, మొదటి ఎస్సార్సీని గౌరవించడమంటే తెలంగాణ ఇవ్వడమేనని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమ్మతమేనని వైయస్ రాజశేఖర రెడ్డి శాసనసభలో అధికారికంగా ప్రకటన చేశారని ఆయన గుర్తు చేశారు. తమతోనే తెలంగాణ వస్తుందనీ సోనియా తెలంగాణ సమస్యను పరిష్కారం చేస్తారనీ కేంద్రం నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటాననీ వైయస్ ఎన్నికల ప్రచార సభల్లో చెప్పారని కెటిఆర్ గుర్తు చేశారు. ఆర్టికల్ 3ని గుర్తు చేసింది కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు.
విజయమ్మ, పయ్యావుల కేశవ్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏం చెప్పినా రాష్ట్రపతి బిల్లుపై శాసనసభ అభిప్రాయాన్ని మాత్మరే కోరారని, ఓటింగుకు అవకాశం లేదని, శాసనసభకు లేని అధికారాన్ని ఆపాదించకూడదని ఆయన అన్నారు. అభిప్రాయాలను స్పీకర్ క్రోడీకరించే క్రమంలో సంఖ్య ఎలాగూ తెలుస్తుందని ఆయన అన్నారు. బిల్లుపై చర్చకు రాష్ట్రపతి 42 రోజులు గడువు ఇచ్చారని, సమయమంతా వృధా చేసి సమయాన్ని పొడగించాలని అడగడాలనే ఆలోచన సరి కాదని ఆయన అన్నారు.
వైయస్ చెప్పారు: శైలజానాథ్
రాష్ట్ర విభజనకు అనుకూలమని వైయస్ రాజశేఖర రెడ్డి సభలోనే స్పష్టంగా చెప్పారని శాసనసభా వ్యవహారాల మంత్రి శైలజానాథ్ గుర్తు చేశారు. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని వైయస్ చెప్పారని ఆయన అన్నారు. ఈ సమయంలో శైలజానాథ్ చేసిన వ్యాఖ్యలపై తెరాస సభ్యులు అభ్యంతరం తెలిపారు.