లోకేశ్..అచ్చెన్నాయుడు కు ప్రివిలేజ్ నోటీసులు : వారం రోజుల సమయం: చరిత్ర రిపీట్ అయ్యేనా..!
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తొలి ఆరు నెలల్లోనే ప్రతిపక్ష సభ్యుల పైన సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ అయ్యాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం పైన అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ ముగ్గురు టీడీపీ నేతల మీద వైసీపీ లెజిస్లేచర్ పార్టీ ఫిర్యాదు చేసింది. దీని పైన స్పీకర్ కార్యాలయం టీడీపీ ఎమ్మెల్సీ లోకేశ్ తో పాటుగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు..మాజీ విప్ కూన రవి కుమార్ పైన వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదుల ఆధారంగా అసెంబ్లీ కార్యదర్శి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేసారు. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని అందులో స్పష్టం చేసారు. అయితే, స్పీకర్ అ్రగిగోల్డ్ వ్యవహారంలో ప్రభుత్వ సాయం అందచేస్తున్న సమయంలో చేసిన వ్యాఖ్యల పైన టీడీపీ నేతలు తీవ్రంగా ప్రతి స్పందించారు. దీంతో..ఈ నోటీసులు జారీ అయినట్లుగా తెలుస్తోంది.

ముగ్గురికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
ప్రభుత్వం ఈ నెల 7వ తేదీన అగ్రిగోల్డ్ బాధితులకు ఆర్దిక సాయం అందించింది. ఆ సమయంలో శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్ తమ్మినేని సీతారం సైతం బాధితులకు ఆర్దిక సాయం అందించారు. ఆ సమయంలో ఆయన అగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలో గతంలో టీడీపీ నేతల పైన ఆరోపణలను తిరిగి ప్రస్తావించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా మాజీ మంత్రి లోకేశ్ పైన ఆరోపణలు చేసారు. దీంతో..టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు..కూన రవి కుమార్ తీవ్ర వ్యాఖ్యలతో ప్రతిస్పందించారు. మాజీ మంత్రి లోకేశ్ స్పీకర్ కు లేఖ రాసారు. అందులో..స్పీకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసారని..ఈ ముగ్గురు మీద చర్యలు తీసుకోవా లని..స్పీకర్ ఛైర్ ప్రతిష్ఠ కాపాడాలని కోరుతూ స్పీకర్ కార్యాలయంలో వైసీపీ నేతలు ఫిర్యాదు చేసారు. ఫలితంగా ఈ ముగ్గురికీ శాసనసభా కార్యదర్శి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేసారు.

వారం రోజులు సమయం..సమాధానం ఇవ్వాలి
టీడీపీ నేతలు ముగ్గురికీ అసెంబ్లీ కార్యదర్శి జారీ చేసిన నోటీసుల్లో పది రోజుల సమయం కేటాయించారు. వారు స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచే విధంగా వ్యవహరించారనే ఫిర్యాదు పైన వివరణ ఇవ్వాలని సూచించారు. అందుకోసం వారికి వారం రోజుల సమయం నిర్దేశించారు. వచ్చే నెల 9వ తేదీ నుండి శాసనసభా శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ లోగానే వారి నుండి సమాధానం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయం భావిస్తోంది. వారిచ్చే సమాధానాలకు అనుగుణంగా..వాటిని సభలో స్పీకర్ ప్రస్తావించే అవకాశం ఉంది. వారి సమాధానం సంతృప్తి కరంగా ఉంటే స్పీకర్..మందలించి వదిలేసే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. సమాధానం ఆ విధంగా లేకపోతే..ఈ మొత్తం వ్యవహారాన్ని స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేసే అవకాశం ఉంది. అదే సమయంలో మూడ్ ఆఫ్ ది హౌస్ గా ప్రభుత్వంతో సహా ఇతర పక్షాల అభిప్రాయాలను సైతం స్పీకర్ సేకరించే అవకాశం ఉంటుంది.

టీడీపీ హాయంలో జరిగిన విధంగా..
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో సీఎం పైన అనుచిత వ్యాఖ్యల కారణంగా వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఏడాది కాలం పాటు సస్పెండ్ చేసారు. అదే విధంగా టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మీద అనుచితంగా వ్యాఖ్యలు చేసారనే మరో ఫిర్యాదు పైన ప్రివిలేజ్ కమిటీ రోజా పైన విచారణ చేసింది. దీంతో పాటుగా..ప్రత్యేక హోదా డిమాండ్ తో సభలో ఆందోళన చేసే సమయంలో నాటి స్పీకర్ కోడెల పైన వైసీపీకి చెందిన అయిదుగురు సభ్యులు హద్దు మీరి వ్యాఖ్యలు చేయటంతో..వారి వ్యవహారాన్ని ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేసారు. అందులో కొడాలి నాని..చెవిరెడ్డి భాస్కర రెడ్డి సైతం ఉన్నారు. వారు తాము ఉద్దేశ పూర్వకంగా వ్యవహరించలేదని..వివరణ ఇచ్చారు. వైసీపీ నుండి అధికార పార్టీ నేతల మీద నాడు అనేక సార్లు సభా హక్కుల ఉల్లంఘన ఫిర్యాదులు చేసినా..అవి చర్యల వరకు రాలేదు. ఇక, ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన నోటీసుల్లో లోకేశ్..అచ్చెన్నాయుడు పైన వైసీపీ ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉంది. దీంతో..ఈ అంశం రాజకీయంగా ఎటువంటి మలుపులు తిరుగుతుందో అనే ఉత్కంఠ రాజకీయంగా నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications